ఒకప్పుడు సెలబ్రిటీగా మారాలంటే ఎంతో కష్టపడాల్సి వచ్చేది. సినిమా రంగంలో, టీవీరంగంలో రాణిస్తేనే నలుగురిలో గుర్తింపు వచ్చేది. ఇప్పుడు ఆ అవసరం లేదు. సోషల్ మీడియాలో ఓవర్ నైట్ సెలబ్రిటీలుగా మారిపోయే అవకాశం ఉంది. రీల్స్, వీడియోస్ గుర్తింపు తీసుకురావడమే కాదు, చేతి నిండా డబ్బులు కూడా తెచ్చి పెడుతున్నాయి. ఎంతో మంది అనామకులు ఈ రోజు సెలబ్రిటీలు గా మారిపోతున్నారు. రైల్వే స్టేషన్ లో పాటలు పాడుకునే రేణూ మండల్ నుంచి కుంభమేళాలో పూసలు అమ్మిన మోనాలిసా వరకు అలా సెలబ్రిటీగా మారిన వాళ్లే. సోషల్ మీడియా గుర్తింపును కాపాడుకుని పైకి ఎదిగిన వాళ్లు కొంతమంది అయితే, కొద్ది రోజుల్లోనే మాయమైపోయిన వాళ్లూ ఉన్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఓ మహిళ కూడా ఒకప్పుడు తినడానికి తిండిలేని స్థాయి నుంచి ఈ రోజు చేతి నిండా డబ్బు, పెద్ద ఇల్లుతో లగ్జరీ లైఫ్ కొనసాగిస్తోంది. ఇంతకీ ఆమె ఎవరు? ఏంటీ ఆమె సక్సెస్ స్టోరీ..
మీను ప్రజాపతి. రాజస్థాన్ లోని అల్వార్ కు చెందిన మహిళ. సోషల్ మీడియా ఉపయోగించే చాలా మందికి ఈమె ఎప్పుడో ఒకప్పుడు కనిపించే ఉంటుంది. ఎదో ఒక సందర్భంగా ఆమె వీడియోలు చూసే ఉంటారు. ఇప్పుడు లగ్జరీ లైఫ్ గడుపుతున్న మీను.. ఒకప్పుడు అత్యంత నిరుపేద జీవితాన్ని గడిపింది. తండ్రి తన వృత్తి అయిన కుమ్మరి పని చేసేవాడు. మట్టిపాత్రలు తయారు చేసి మార్కెట్ లో అమ్మి కొంత డబ్బు సంపాదించేవాడు. మీనూతో పాటు మొత్తం ఐదుగురు అమ్మాయిలు. వారంతా తండ్రికి మట్టి పనిలో సాయపడేవాళ్లు. అయినప్పటికీ చాలా చాలని డబ్బులతో కుటుంబాన్ని ముందుకు లాగేవాడు ఆమె తండ్రి. అమ్మానాన్నతో కలిసి ఐదుగురు అమ్మాయిలో చిన్న మట్టి ఇంట్లో ఉండేవాళ్లు. వర్షం వస్తే వారి బాధలు వర్ణణాతీతం. మిద్దె అంతా కురిసేది. అందులోనే అడ్జెస్ట్ అయ్యేవాళ్లు. చిన్నప్పుడు ఆమె పడని బాధలు అంటూ లేవు.
సుమారు 16 ఏళ్ల వయసులోనే ఆమెకు పెళ్లి సంబంధాలు చూశాడు తండ్రి. ఆమె భర్త కుల్దీప్ రాజ్ కు కూడా పెద్దగా ఆస్తిపాస్తులు లేవు. తను కూడా కులవృత్తి అయిన కుమ్మరి పని చేసేశాడు. పెళ్లయ్యాక ఇద్దరు పిల్లలు అయ్యారు. అదే సమయంలో మీను స్మార్ట్ ఫోన్ కొని సోషల్ మీడియాలోకి అడుగు పెట్టింది. ముందు ఫేస్ బుక్, ఆ తర్వాత ఇన్ స్టాగ్రామ్, నెమ్మదిగా యూట్యూబ్ ఛానెల్ కూడా ఓపెన్ చేసింది. ఇప్పుడు మీను యూట్యూబ్ చానెల్ కు ఏకంగా 2.5 మిలియన్ సబ్ స్క్రైబర్లు ఉన్నారు. ఫేస్ బుక్ లో 4.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్ స్టాలో 2.1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఫన్నీ వీడియోలు, చక్కటి డ్యాన్స్ వీడియోలు, కొన్నిసార్లు అందాలు ఆరబోస్తూ ఆకట్టుకుంటుంది కూడా. సోషల్ మీడియా ద్వారా మంచి ఆదాయాన్ని పొందుతుంది. ఒకప్పుడు పేదరికాన్ని అనుభవించిన ఆమె, ఇప్పుడు పెద్ద బంగళా, మంచి కారు, చేతినిండా డబ్బుతో హ్యాపీగా జీవితాన్ని గడుపుతోంది. సోషల్ మీడియా ద్వారా తన జీవితాన్ని పూర్తిగా మార్చేసుకుంది మీనూ ప్రజాపతి. నిజంగా ఆమెకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!
Read Also: ఆ విమానంలోని సీట్ల నిండా బంగాళ దుంపల బస్తాలు వేశారు.. ఎందుకో తెలుసా?