NEET Reexam: మెడికల్ సీటు సాధించాలనే కలతో కష్టపడిన విద్యార్థుల ఆశలు ఒక్క నిమిషం ఆలస్యంతో ముక్కలైన సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. మే నెలలో జరిగిన నీట్ యూజీ పరీక్ష పేపర్ లీకేజీ వివాదం కారణంగా జూన్ 21న దేశవ్యాప్తంగా నిర్వహించిన రీ-ఎగ్జామినేషన్లో గుండెల్ని పిండేసే దృశ్యాలు వెలుగుచూశాయి. ముఖ్యంగా బెంగళూరు ప్యాలెస్ రోడ్డులోని గవర్నమెంట్ రామనారాయణ చెల్లారామ్ కాలేజీ వద్ద చోటుచేసుకున్న ఘటన సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విధించిన కఠిన నిబంధనల ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకల్లా ఎగ్జామ్ సెంటర్ గేట్లు మూసివేయాలి. అయితే సిటీలో ఏర్పడిన భారీ ట్రాఫిక్ జామ్ కారణంగా కొద్ది నిమిషాల ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను అధికారులు లోపలికి అనుమతించలేదు. దీంతో చేతులు జోడించి, కన్నీరు మున్నీరవుతూ గేట్ల ముందే నిలబడిపోయిన విద్యార్థుల ఆర్తనాదాలు నెటిజన్ల మనసులను కలచివేస్తున్నాయి.
ఒక విద్యార్థి ఏకంగా మూసి ఉన్న ఇనుప గేటు ఎక్కి లోపలికి దూకేందుకు ప్రయత్నించిన దృశ్యాలు ఇంటర్నెట్లో దావానలంలా వ్యాపించాయి. కేవలం బెంగళూరులోనే కాదు, మధ్యప్రదేశ్లోని భోపాల్తో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లోనూ ఇదే తరహా విషాదాలు పునరావృతమయ్యాయి. భోపాల్లో ఒక విద్యార్థి మేనమామ తమ ఆవేదనను పంచుకుంటూ, దారి మధ్యలో వాహనం నిలిచిపోవడం వల్లే తాము అనుకున్న సమయానికి రాలేకపోయామని కన్నీటి పర్యంతమయ్యారు.
ఈ మొత్తం వ్యవహారం వెనుక బెంగళూరులో జరిగిన ఒక పొలిటికల్ ఈవెంట్ కూడా తీవ్ర వివాదానికి దారితీసింది. పరీక్ష రోజే ప్యాలెస్ గ్రౌండ్స్లో కాంగ్రెస్ పార్టీ భారీ రాజకీయ కన్వెన్షన్, ర్యాలీ నిర్వహించడంతో నగరం మొత్తం అంబులెన్స్లు కూడా కదలలేనంతగా స్తంభించిపోయింది. దీనివల్ల సమయానికి సెంటర్లకు చేరుకోలేకపోయిన విద్యార్థుల భవిష్యత్తును కాంగ్రెస్ ప్రభుత్వం బలితీసుకుందని బీజేపీ నేత తేజస్వి సూర్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అయితే ఈ ఆరోపణలను కాంగ్రెస్ ఖండించింది.
also read :Mega 158.. హైదరాబాద్లోనే మెగాస్టార్ వేట.. బాబీ నయా ప్లాన్ నెక్ట్స్ లెవెల్ అంతే!
కేవలం ఒకరిద్దరు మాత్రమే వ్యక్తిగత కారణాల వల్ల ఆలస్యంగా వచ్చారని, కొందరు పాత హాల్ టికెట్లతో రావడం వల్లే తిరస్కరణకు గురయ్యారని కౌంటర్ ఇచ్చింది. ఈ రాజకీయ రచ్చ ఎలా ఉన్నా, లక్షలాది మంది విద్యార్థులు రాసిన ఈ దేశంలోనే అతిపెద్ద మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ మాత్రం తీవ్ర భావోద్వేగాల మధ్య ముగిసింది. మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5.15 గంటల వరకు జరిగిన ఈ పరీక్ష కోసం ఎన్టీఏ మునుపెన్నడూ లేనంతగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిఘా, బయోమెట్రిక్ వెరిఫికేషన్, దాదాపు లక్షన్నర సీసీటీవీ కెమెరాలతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది.
డిజిటల్ ప్లాట్ఫామ్స్పై ఈ ఉదంతంపై నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయి చర్చించుకుంటున్నారు. ఒక వర్గం నెటిజన్లు ఎన్టీఏ రూల్స్ను సమర్థిస్తూ, కాబోయే డాక్టర్లకు సమయపాలన చాలా ముఖ్యమని, ఎమర్జెన్సీ వార్డుకు డాక్టర్ ఐదు నిమిషాలు ఆలస్యంగా వస్తే రోగి ప్రాణాలు పోతాయని, కాబట్టి వ్యవస్థను తప్పుపట్టలేమని కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు మెజారిటీ నెటిజన్లు ఈ క్రూరమైన నిబంధనలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేపర్ లీక్ చేసి లక్షలాది మంది జీవితాలతో ఆడుకున్న వ్యవస్థకు లేని నిబంధనలు, ట్రాఫిక్లో ఇరుక్కుని ప్రాధేయపడుతున్న అమాయక విద్యార్థులపైనే చూపిస్తారా అంటూ మండిపడుతున్నారు.
also read :మెగా హీరో సినిమా సస్పెన్స్..వంద కోట్ల బడ్జెట్ బూడిదలో పోసిన పన్నీరేనా?