Indus Dispute: బలుపుకు బ్రాండ్ అంబాసిడర్ అంటూ ఉంటే అది పాకిస్థానే అవుతుంది. లేకపోతే.. ఏంటి మరి? సింధు జలాల ఒప్పందం విషయంలో వెనక్కి తగ్గేది లేదని భారత్ ఎన్నోసార్లు స్పష్టం చేసేసింది. అయినాసరే పాకిస్థాన్ నేతలకు ఈ విషయం తలకెక్కట్లేదు. అందుకోసమే.. మరోసారి పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ రెచ్చగొట్టే కామెంట్స్ చేశారు. సింధు నదీ జలాలు పాక్లోకి రాకుండా అడ్డుకుంటే.. ఇండియాతో యుద్ధానికైనా సిద్ధమని మాట తూలారు. భారత్ చర్యలు తమ నీటి సరఫరాకు ముప్పు కలిగిస్తున్నాయన్నారు. ఈ విషయంలో అవసరమైతే భారత్తో యుద్ధానికైనా దిగుతామన్నారు. జలభద్రతపై పాకిస్థాన్ ఆందోళన వ్యక్తం చేస్తున్న వేళ ఈ రెచ్చగొట్టే మాటలు సింధు జలాల ఒప్పందంపై ఇప్పటికే ఉన్న టెన్షన్లని మరింత పెంచింది.
పహల్గామ్ టెర్రర్ ఎటాక్ తర్వాత.. సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపేసింది. పాకిస్థాన్ ఉగ్రవాదానికి పూర్తిగా, విశ్వసనీయంగా అడ్డుకట్ట వేయకపోతే.. ఒప్పందాన్ని పునరుద్ధరించే ప్రసక్తే లేదని భారత్ తేల్చి చెప్పింది. అయితే, పాక్కు వచ్చే నీటి ప్రవాహాన్ని తగ్గించడం గానీ, అడ్డుకోవడం గానీ చేస్తే అది జాతీయ భద్రతా సమస్యగా మారుతుందని ఖవాజా ఆసిఫ్ రెచ్చగొడుతున్నారు. పాక్ ఆర్థిక వ్యవస్థ, కోట్లాది మంది ప్రజల జీవనాధారం సింధు నదీ వ్యవస్థపై ఆధారపడి ఉందని ఆసిఫ్ అన్నారు. తమ నీటి హక్కులను కాపాడుకునేందుకు అన్ని మార్గాలను ఉపయోగిస్తామని, యుద్ధం వరకు వెళ్లేందుకైనా సిద్ధమని ఆసిఫ్ హెచ్చరించారు.
Also read: మాటల్లోనే మైనార్టీ బడ్జెట్.. చేతల్లో శూన్యం.. ప్రభుత్వంపై కవిత ఫైర్!
1960లో సింధు జలాల ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం.. సింధు నదీ వ్యవస్థలోని ఆరు నదులను భారత్, పాకిస్థాన్కు సమానంగా కేటాయించారు. అగ్రిమెంట్ ప్రకారం.. రావి, బియాస్, సట్లెజ్ నదులపై భారత్కు హక్కుంది. సింధు, జీలం, చీనాబ్ నదులపై పాకిస్థాన్కు హక్కులున్నాయ్. ఈ నదుల్లో ప్రవహించే 80 శాతం నీరు పాకిస్థాన్కే వెళ్తోంది. ఇది ఆ దేశ వ్యవసాయం, వాటర్ సప్లై సిస్టమ్, ఆర్థిక వ్యవస్థకు ఎంతో కీలకమైనది. అయితే, పాక్కు కేటాయించిన మూడు నదులపైనా.. భారత్కు కొన్ని పరిమిత హక్కులున్నాయ్. పాక్కు కేటాయించిన నదులపై భారత్ జలవిద్యుత్ ప్రాజెక్టుకు నిర్మించుకోవచ్చు. తాగునీరు, సాగు నీరు, ఇతర అవసరాలకు పరిమిత స్థాయిలో నీటిని వాడుకోవచ్చు. ఒప్పందం ప్రకారం నదుల ప్రవాహాన్ని పూర్తిగా అడ్డుకునేందుకు వీల్లేదు.
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత.. భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాదు, చీనాబ్, జీలం నదులపై కొన్ని ప్రాజెక్టులు నిర్మిస్తోంది. ఈ నిర్మాణాలపై పాకిస్థాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో.. సింధు నదీ వ్యవస్థపై భారత్ తీసుకుంటున్న చర్చలు.. పాకిస్థాన్ జల భద్రతకు ముప్పుగా భావిస్తే.. ఇస్లామాబాద్ సైనిక చర్యలు పాల్పడొచ్చని ఖవాజా ఆసిఫ్ హెచ్చరించారు. 2028 జూన్ నాటికి.. పాకిస్థాన్కు సింధు జలాలను పూర్తిగా నిలిపేయొచ్చని.. భారత జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ చెబుతున్న వీడియో క్లిప్ వైరల్ అయ్యాక.. పాక్ రక్షణ మంత్రి నుంచి ఈ కామెంట్లు వచ్చాయి. ఇప్పటికే.. సింధు జలాల ఒప్పందాన్ని భారత్ ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తూ.. పాక్ డిప్యూటీ పీఎం ఇషాక్ దార్.. కొద్దిరోజుల క్రితమే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి జోక్యం చేసుకోవాలని కోరారు. పాకిస్థాన్లో పెరుగుతున్న నీటి కొరత, వాతావరణ ఒత్తిళ్ల వేళ.. రెండు దేశాల మధ్య సింధు జలాల వివాదం మరింత ఉద్రిక్తతలను పెంచింది.
Also read: తుంగభద్ర జలాలపై.. రాజీపడే ప్రసక్తే లేదు.. తేల్చేసిన మంత్రి ఉత్తమ్