Indian Railways: సరిహద్దుల్లో తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశ ప్రజలకు భద్రత కల్పిస్తున్నారు సైనికులు. ఎప్పుడు తమ ప్రాణాలు పోతాయో తెలియని పరిస్థితుల్లో పుట్టిన గడ్డను కంటికి రెప్పలా కాపాడుతున్నారు. శత్రు దేశాల కుయుక్తులు, ఉగ్రమూకల దొంగ దెబ్బలను తిప్పికొడుతున్నారు. భరతమాత సేవలో ప్రాణాలు విడిచేందుకు సైతం వెనుకాడటం లేదు. అలాంటి సైనికులకు భారతీయ రైల్వేలో కనీస గౌరవం లభించడం లేదు. తాజాగా రైల్లో ప్రయాణిస్తున్న సైనికులకు సంబంధించి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
టాయిలెట్ పక్కనే నిద్రపోతున్న జవాన్లు
ఓవైపు పాకిస్తాన్ తో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో జవాన్లు కంటి మీద కునుకు లేకుండా భద్రతను పర్యవేక్షిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ప్రజలు జవాన్లకు నీరాజనాలు పలుకుతున్నారు. కానీ, రైళ్లలో వారికి కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. దేశ రక్షణ కోసం జీవితాలను అర్పించే సైనికులు తాజాగా ఓ రైలులో టాయిలెట్స్ పక్కన పడుకుని ప్రయాణిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దేశ పరిరక్షకులకు ఇచ్చే గౌరవం ఇదేనా? అంటూ నెటిజన్లు రైల్వేపై ఫైర్ అవుతున్నారు. జవాన్లు ఎలాంటి రిజర్వేషన్ లేకుండా ప్రయాణించే సైనిక కోచ్ లను ఎందుకు తొలిగించారో చెప్పాలంటూ ప్రశ్నిస్తున్నారు.
సైనికులకు ఇచ్చే గౌరవం ఇదేనా?
దేశ రక్షణ కోసం జీవితాలను అర్పించే సైనికులు రైలులో టాయిలెట్స్ పక్కన పడుకున్న వీడియో వైరలవుతోంది. దేశ పరిరక్షకులకు ఇచ్చే గౌరవం ఇదేనా? అంటూ నెటిజన్లు రైల్వేపై ఫైర్. రిజర్వేషన్ లేకుండా ప్రయాణించగలిగే సైనిక కోచ్లను ఎందుకు తొలగించారంటూ ప్రశ్నిస్తున్నారు. pic.twitter.com/Z2x84o1oiw
— ChotaNews App (@ChotaNewsApp) May 19, 2025
రైల్వే ఆదాయమే ముఖ్యంగా భావిస్తోంది!
సైనికుల వీడియోపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైల్వేకి ఆదాయమే ముఖ్యం ఇంక విలువలతో పనేముంది? అని విమర్శిస్తున్నారు. “ఇప్పటికే RAC పేరుతో జనాలను దోచుకుంటున్నారు. ప్యాసింజర్ రైళ్ళను చాలా వరకు రద్దు చేశారు. సామాన్యులు, దేశానికి సేవ చేసేవాళ్ళు వీళ్ళ కళ్ళకు కనిపించరు. అయినా.. రైల్వేను ప్రైవేటు పరం చేద్దామనే ఆలోచన ఉన్నవాళ్ల నుంచి ఇంతకు మించి ఇంకేం ఆశించగలం?” అంటూ మండిపడుతున్నారు. భారతీయ రైల్వే సైనికుల ప్రయాణాల కోసం ప్రత్యేక కోచ్ ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి వీడియోలను చూస్తుంటే, మన కోసం ప్రాణాలు ఇచ్చే వారికి ఇచ్చే గౌరవం ఇదా? అని బాధేస్తుందంటున్నారు.
సైనికుల సెలవులు రద్దు చేసిన కేంద్రం
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత దేశ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ దాడికి ప్రతీకారంగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ నిర్వహించింది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ తో పాటు పాకిస్తాన్ లోపలికి వెళ్లి ఏకంగా 9 ఉగ్ర స్థావరాలపై వైమానిక దాడులు చేసింది భారతీయ సైన్యం. ఈ ఘటన తర్వాత పాక్ భారత్ మీదికి మిసైల్స్ దాడి చేసింది. వాటిని భారత డిఫెన్స్ సిస్టమ్ సమర్థవంతంగా ఎదుర్కొంది. ప్రతి దాడిగా పాకిస్తాన్ లోని ఎయిర్ బేస్ లను భారత వాయుసేన ధ్వంసం చేసింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నది. అదే సమయంలో పాకిస్తాన్ కాల్పుల విరమణ కోసం రాజీకి రావడంతో భారత్ అంగీకరించింది. ప్రస్తుతం సరిహద్దుల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి.
Read Also: రన్నింగ్ ట్రైన్ కు వేలాడుతూ స్టంట్స్, జారిపడి స్పాట్ లోనే.. నెట్టింట వీడియో వైరల్!