కొన్నిసార్లు చిన్న చిన్న పొరపాట్లు ప్రాణాలు తీసే వరకు వెళ్తాయి. తాజాగా ఇలాంటి ఘటనే నోయిడాలో జరిగింది. చిన్న నిర్లక్ష్యం ఇద్దరు స్నేహితుల ప్రాణాలు కోల్పోయేలా చేసింది. రాత్రి సంతోషంగా నిద్రపోయిన వాళ్లు, తెల్లవారే సరికి గదిలో విగతజీవులుగా పడి ఉండటం చూసి అందరూ షాక్ అయ్యారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
నిద్రలోనే ప్రాణాలు కోల్పోయిన స్నేహితులు
నోయిడాకు చెందిన యువకులు ఉపేంద్ర, శివమ్ మంచి మిత్రులు. చిన్నప్పటి నుంచి కలిసే పెరిగారు. వీరిద్దరు కలిసి స్ట్రీట్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. నోయిడాలోని సెక్టార్ 70లో ఛోలో భాతురే అమ్ముతూ జీవనోపాధి కొనసాగిస్తున్నారు. తాజాగా ఎప్పటి లాగే తమ వ్యాపారాన్ని ముగించుకుని ఇంటికి చేరుకున్నారు. వచ్చి డబ్బును లెక్కించి, మంచి లాభం రావడంతో సంతోషం వ్యక్తం చేశారు. మరుసటి రోజు వ్యాపారం కోసం కావాల్సిన సామాగ్రిని సిద్ధం చేయాలనుకున్నారు. ఒకపాత్రలో శనగలు పోసి స్టవ్ మీద పెట్టారు. వాటిని ఉడకబెట్టి స్టౌవ్ ఆఫ్ చేయాలనుకున్నారు. అదే సమయంలో వంట చేసి భోజనం చేశారు. తినేసి ఇద్దరూ నిద్రపోయారు. స్టౌవ్ ఆఫ్ చేయడం మర్చిపోయారు. కానీ, అదే తమకు చివరి రోజు అవుతుందని అస్సలూ ఊహించి ఉండరు. గది తలుపులు మూసి ఉండటంతో స్టౌవ్ మీది శనగల నుంచి గది అంతా పొగ నిండిపోయింది. అదంతా కార్బన్ మోనాక్సైడ్ కావడం, దాన్ని ఇద్దరూ పీల్చడంతో నిద్రలోనే చనిపోయారు. ఈ ఘటన శుక్రవారం అర్థరాత్రి జరిగింది.
నోయిడా పోలీసులు ఏం చెప్పారంటే?
శనివారం పొద్దున్నే ఇంట్లో నుంచి పొగలు రావడంతో చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు స్పాట్ కు చేరుకుని ఏం జరిగిందో దర్యాప్తు చేశారు. “ఇద్దరు స్నేహితులు నిద్రపోయే ముందు గది తలుపులు, కిటికీలు క్లోజ్ చేశారు. రాత్రి శనగలను ఉడకబెట్టేందుకు స్టవ్ ఆన్ చేసి అలాగే నిద్రపోయారు. శనగలు మాడిపోయి విషపూరిత పొగ గది అంతా వ్యాపించింది. డోర్, విండోలు క్లోజ్ చేయడంతో గది అంతా వ్యాపించింది. వారికి ఆక్సిజన్ అందకపోవడంతో ఊపిరి ఆడలేదు. నిద్రలోనే వాళ్లు చనిపోయినట్లు ప్రాథమికంగా నిర్థారణ చేశాం. దర్యాప్తులో అసలు విషయాలు బయటకు వస్తాయి” అని నోయిడా సెంట్రల్ జోన్ అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ రాజీవ్ గుప్తా వెల్లడించారు.
Read Also: బాబోయ్.. ఇంత పెద్ద రుమాల్ రోటినా, తినడానికా, చలికి కప్పుకోవడానికా నాయనా?
గది తలుపులు బద్దలు కొట్టిన పొరుగువాళ్లు
శనివారం ఉదయం వారి గది నుంచి పొగలు రావడంతో ఇరుగుపొరుగు వాళ్లు తలుపులు పగులగొట్టి చూశారు. ఇద్దరు అప్పటికే అపస్మారక స్థితిలోకి ఉన్నారు. వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అప్పటికే వాళ్లిద్దరు చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. వారి మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. అనంతరం కుటుంబ సభ్యులకు వారి మృతదేహాలను అందజేశారు. వారి మరణంపై విచారణ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.
Read Also: మహా కుంభమేళాకు వెళ్లే ముందు ఇవి తెలుసుకోండి.. తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా వెళ్లాలంటే?