ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో అరుదైన, పురాతన వస్తువులకు సంబంధించి వేలం జరుగుతూ ఉంటాయి. వీటిని కొనుగోలు చేసేందుకు చాలా మంది పోటీ పడుతుంటారు. లక్షలాది రూపాయలు వెచ్చించి ఈ వస్తువులను దక్కించుకుంటారు. తాజాగా లండన్ లో జరిగిన వేలం పాటలో ఓ అరుదైన రూ. 100 నోటు ఏకంగా రూ. 56 లక్షలకు అమ్ముడుపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంతకీ ఆ నోటు ఎందుకు అంత ధర పలికిందో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంతకీ రూ. 100 నోటు ప్రత్యేక ఏంటంటే?
తీర్థయాత్రల సమయంలో కరెన్సీ వినియోగాన్ని నియంత్రించేందుకు గాను భారతీయ రిజర్వ్ బ్యాంక్ హజ్ నోట్ల జారీ ప్రక్రియను మొదలుపెట్టింది. అందులో భాగంగానే 1950లలో RBI ఓ నోటును విడుదల చేసింది. ఈ ప్రత్యేకమైన నోటుకు HA 078400 అనే సీరియల్ నెంబర్ ఇచ్చింది. ఇది హజ్ నోట్స్ అని పిలువబడే ఒక విభిన్న శ్రేణికి చెందిన నోటు. అప్పట్లో భారతీయ కరెన్సీని ఉపయోగించి బంగారాన్ని అక్రమంగా కొనుగోలు చేయడాన్ని నిరోధించడంలో భాగంగా ఈ నోట్లను విడుదల చేసేవారు.
హజ్ నోట్ల ఫీచర్లు ఎలా ఉంటాయంటే?
హజ్ యాత్ర కోసం ప్రత్యేకంగా విడుదల చేసే ఈ నోట్లు సీరియల్ నెంబర్ కు ముందుకు HA అనే అక్షరాలను కలిగి ఉంటాయి. ఈ నోట్లు ఇతర నోట్లలో కలిసి ఉన్నా ఈజీగా గుర్తించే అవకాశం ఉంటుంది. అంతేకాదు, సాధారణ ఇండియన్ కరెన్సీ నోట్లతో పోల్చితే ఈ నోట్లు ప్రత్యేకమైన రంగును కలిగి ఉంటాయి. అప్పట్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఒమన్ లాంటి గల్ఫ్ దేశాలలో ఈ నోట్లు చట్టబద్ధమైన టెండర్లో ఉన్నప్పటికీ, భారత్ లో ఉపయోగించే వాళ్లు కాదు.
1970లలో హజ్ నోట్ల జారీ నిలిపివేత
తొలుత ఈ నోట్లను కరెన్సీ వినియోగాన్ని నియంత్రించే చర్యలో భాగంగా విడుదల చేశారు. 1961లో కువైట్ తన సొంత కరెన్సీని ప్రారంభించింది. ఇతర గల్ఫ్ దేశాలు కూడా తమ కరెన్సీని అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఆ తర్వాత భారతీయ హజ్ నోట్లకు ఆదరణ తగ్గింది. 1970ల నాటికి హజ్ నోట్ల జారీని RBI పూర్తిగా నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంటుంది.
Read Also: ఈ ఊర్లో ఇంటికో మంత్రగాడు, చేతబడులే వీరి ఉపాధి.. ధైర్యం ఉంటేనే వెళ్లండి!
రూ.100 నోట్లు కోసం రూ. 56 లక్షలు ఖర్చు
ఇక చాలా మంది కరెన్సీ నోట్లను కలెక్ట్ చేసే హాబీ ఉన్న వాళ్లు, ప్రపంచంలోని అరుదైన కరెన్సీ నోట్లు, నాణేలను సేకరిస్తున్నారు. అందులో భాగంగానే అరుదైన కరెన్సీ నోట్లను వేలంలో పెద్ద మొత్తంలో డబ్బులు వెచ్చించి వీటిని దక్కించుకుంటున్నారు. అలాగే, తాజాగా లండన్ లో నిర్వహించిన వేలం పాటలో ఓ ఔత్సాహికుడు దశాబ్దాల క్రితం నాటి హజ్ నోటును దక్కించుకునేందుకు ఏకంగా రూ. రూ.56,49,650 వెచ్చించడం విశేషం. ప్రస్తుతం ఈ అరుదైన కరెన్సీ నోటకు సంబంధించి చర్చ సోషల్ మీడియాలో జోరుగా జరుగుతున్నది.
Read Also: చందమామపై ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయో తెలుసా? మనిషి తట్టుకోగలడా?