Spanish Woman Searching Missing Mother| 20 ఏళ్ల క్రితం ఒక తల్లి పేదరికం కారణంగా అనివార్య పరిస్థితుల్లో తన కూతురిని వదిలేసి వెళ్లిపోయింది. ఆ తరువాత ఆ పాప అదృష్టం కొద్దీ స్పెయిన్ చేరుకుంది. అయితే ఇప్పుడామె తనకు జన్మనిచ్చిన తల్లిని వెతుక్కుంటూ భారతదేశం వచ్చింది. కానీ తల్లిని వెతకడానికి ఆమె వద్ద ఎక్కువ సమయంలో లేదు.
వివరాల్లోకి వెళితే.. 21 ఏళ్ల స్నేహ ఎన్రీక్ విడాల్ కొన్ని రోజుల క్రితం స్పెయిన్ నుంచి ఇండియాలోని ఒడిశా రాష్ట్రానికి వచ్చింది. 20 ఏళ్ల క్రితం బనలతాదాస్, సంతోష్ అనే దంపతులు ఒడిశా రాజధాని భువనేశ్వర్ నగరంలో నివసించేవారు. సంతోష్ ఒక వంటవాడిగా పనిచేసే వాడు. అతనికి ముగ్గురు పిల్లలు. భవనేశ్వర్ లోని నయాపల్లి ప్రాంతంలో బనలతాదాస్, సంతోష్ ఒక అద్దె ఇంట్లో ఉండేవారు.
అయితే ఒక రోజు సంతోష్ ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఆ సమయంలో బనలతాదాస్ గర్భవతి. ఆమెతో పాటు ఉన్న ముగ్గురు పిల్లలో స్నేహ వయసు దాదాపు 2 సంవత్సరాలు కాగా.. ఆమె తమ్ముడు సోముకి కేవలం 10 నెలలు. వారిద్దరి కంటే మరో అమ్మాయి పెద్దది. ఈ క్రమంలో తన ముగ్గురు పిల్లలు, కడుపులో ఉన్న నాలుగో బిడ్డను పోషించలేని బనలతాదాస్ ఒక రోజు ఎవరికీ చెప్పకుండా ఎటో వెళ్లిపోయింది. ఆమె తనతో పాటు తన పెద్దకూతురుని తీసుకెళ్లినట్లు ఆ ఇంటి ఓనర్ పోలీసులకు చెప్పాడు.
పోలీసులు ఇంట్లో అనాథలుగా ఉన్న స్నేహ(2), సోము(10 నెలలు).. ఇద్దరు పిల్లలను అనాథాశ్రమంలో చేర్పించారు. కాలక్రమంలో 2010లో స్పెయిన్ దేశం నుంచి సంతానం లేని దంపతులు.. జెమా, జోష్ ఎన్రిక్ విడాల్ ఇండియా వచ్చారు. వారు భువనేశ్వర్ లోని అనాథాశ్రమంలో స్నేహ, సోముని చూసి చట్టప్రకారం దత్తత తీసుకున్నారు. ఆ తరువాత పిల్లలను తీసుకొని స్పెయిన్ వెళ్లిపోయారు.
Also Read: చినిగిన షర్టు ముక్కతో హంతకుడిని పట్టుకున్న పోలీసులు.. సినిమా కాదు రియల్!
జమా ఒక యోగా టీచర్. జోష్ ఒక బిజినెస్ మెన్. స్పెయిన్ లో వీరిద్దరు చాలా సాదా జీవనం గడుపుతున్నారు. స్నేహ, సోముని తమ సొంత పిల్లల్లా పోషించారు. స్నేహ ప్రస్తుతం టీచర్ ఉద్యోగం కోసం శిక్షణ తీసుకుంటోంది. ఆమె తమ్ముడు సోము లాజిస్టిక్స్ కోర్సు చదువుతున్నాడు. అయితే 2023లో జెమా.. స్నేహకు దత్తత విషయం చెప్పింది. ఒడిశాలోని ఒక అనాథ ఆశ్రమం నుంచి దత్తత తీసుకున్నామని తెలిపింది.
దీంతో స్నేహ మానసికంగా కుంగిపోయింది. అది చూసిన జెమా తాను అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డను అలా చూడలేక.. ఆమెకు శాంత పరచడానికి ఏదైనా చేయడానికి సిద్దపడింది. దీంతో స్నేహ తనకు జన్మనిచ్చిన తల్లిని ఒక్కసారైనా కలుసుకోవాలని అడిగింది. స్నేహ కోరిక తీర్చడానికి జెమా ఆమెను వెంటబెట్టుకొని.. 2023లో భవనేశ్వర్ చేరుకొని అనాథశ్రమం నుంచి స్నేహ తల్లిదండ్రుల కోసం వెతకడం ప్రారంభించింది. అయితే మొదట్లో వారికి ఒడియా భాష తెలియకపోవడంతో చాలా ఇబ్బందులు పడ్డారు.
కొంతమంది అయితే తాము స్నేహ తల్లిదండ్రులున వెతికిపెడతామని నమ్మించి వారి వద్ద నుంచి భారీగా డబ్బులు కూడా తీసుకున్నారు. కానీ ఆ తరువాత మోసం చేశారు. ఈ క్రమంలో వారికి సాయం చేయడానికి రమా దేవి ఉమెన్స్ యూనివర్సిటీకి చెందిన ఒక టీచర్ సుధా మిశ్రా ముందుకు వచ్చింది. వారిని తీసుకొని భువనేశ్వర్ పోలీస్ కమిషనర్ దేవ్ దత్తా సింగ్ ని కలిసింది. విషయమంతా తెలుసుకున్న కమిషనర్ దేవ్ దత్తా సింగ్ వారికి సాయంగా ఇద్దరు పోలీసు అధికారులను నియమించారు.
దీంతో పోలీసులు విచారణ చేయగా.. స్నేహ తల్లిదండ్రులు బనలతా దాస్, సంతోష్ దాస్ కటక్ జిల్లాలోని బడంబా నరసింహపూర్ ప్రాంతానికి చెందిన వారని తెలిసింది. జెమా, స్నేహ ఇద్దరూ కలిసి నరసింహపూర్ గ్రామానికి వెళ్లారు. కానీ వారికి బనలతాదాస్ ఆచూకీ తెలియలేదు.
తాజాగా స్నేహ, జెమాలను గురించి స్థానిక మీడియా ఇంటర్వ్యూ చేసింది. అందులో స్నేహ చేస్తున్న టీచర్ కోర్సు కోసం తిరిగి వెళ్లిపోవాల్సిన పరిస్థితులుండగా.. తిరిగి ఆమె మార్చి నెలలో మళ్లీ తన తల్లి కోసం వస్తుందని చెప్పింది. తన తల్లిని వెతకడానికి జీవితాంతం ప్రయత్నిస్తూనే ఉంటానని తెలిపింది.