Doctor Saves Dog: జంతువుల పట్ల ఉన్న ప్రేమకు, ప్రస్తుత కాలంలో అందుబాటులో ఉన్న ఆధునిక వైద్య సాంకేతికతకు అద్దం పట్టే ఓ అరుదైన ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. ప్రాణం ఏదైనా విలువైనదే అని నిరూపిస్తూ.. తన పెంపుడు కుక్కను కాపాడుకోవడానికి ఓ యజమాని చేసిన ప్రయత్నం.. అందుకు ఢిల్లీ నుంచి తరలివచ్చిన వైద్యుడి సేతలు ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
విశాఖపట్నానికి చెందిన ఓ వ్యక్తి గోల్డెన్ రిట్రీవెర్ జాతికి చెందిన కుక్కను ఎంతో ప్రాణప్రదంగా పెంచుకుంటున్నారు. అయితే గత కొన్ని రోజులుగా ఆ కుక్క ఆహారం తీసుకోకుండా తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆందోళన చెందిన యజమాని స్థానిక వెటర్నరీ వైద్యులను సంప్రదించి ఎక్స్రే తీయించగా.. అసలు విషయం బయటపడింది. ఆ కుక్క పొట్టలో దారపు ఉండతో పాటు ఒక సూది కూడా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.
సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో శస్త్రచికిత్స (Surgery) చేసి వాటిని తొలగిస్తారు. కానీ.. ఆ కుక్కకు ప్లేట్లెట్స్ సంఖ్య గణనీయంగా పడిపోవడంతో సర్జరీ చేయడం ప్రాణాపాయంగా మారింది. కత్తితో కోత కోయకుండా ఆ వస్తువులను బయటకు తీయడం ఒక్కటే మార్గమని వైద్యులు భావించారు. ఇందుకోసం ఎండోస్కోపీ విధానం ఉత్తమమని నిర్ణయించారు.
విశాఖలో ఆ సమయంలో ఆ నిపుణులు అందుబాటులో లేకపోవడంతో.. యజమాని ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఢిల్లీలోని ఓ ప్రముఖ వెటర్నరీ స్పెషలిస్ట్ను సంప్రదించారు. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్న సదరు డాక్టర్.. కేవలం ఒక మూగజీవిని కాపాడటం కోసం ఢిల్లీ నుంచి విమానంలో హుటాహుటిన విశాఖకు చేరుకున్నారు.
డాక్టర్ విశాఖ చేరుకున్న వెంటనే తన బృందంతో కలిసి చికిత్స ప్రారంభించారు. ఎండోస్కోపీ పరికరాల సహాయంతో కుక్క పొట్టలో చిక్కుకుపోయిన దారపు ఉండను, సూదిని సుమారు 45 నిమిషాల పాటు శ్రమించి సురక్షితంగా బయటకు తీశారు. ఎటువంటి సర్జరీ లేకుండానే ఆ కుక్క ప్రాణాలను కాపాడటంతో యజమాని ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఆ గోల్డెన్ రిట్రీవెర్ కోలుకుంటోంది. యజమాని చూపిన బాధ్యత, వైద్యుడి సమయస్ఫూర్తిని చూసి జంతు ప్రేమికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Also Read: ఇంత ఘోరమా.. మూడేళ్ల చిన్నారిని చితకబాదిన అంగన్వాడి టీచర్