YS Jagan: తూర్పుగోదావరి జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. జగన్ ర్యాలీ సమయంలో వైసీపీ శ్రేణులు ఒక్కసారిగా పొగాకు బోర్డు కార్యాలయం వైపు దూసుకురావడంతో అక్కడ ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. బోర్డును ముట్టడించేందుకు ప్రయత్నించిన కార్యకర్తలను అడ్డుకోవడానికి పోలీసులు యత్నించినప్పటికీ, భారీగా తరలివచ్చిన జనం వారిని నెట్టుకుంటూ ముందుకు వెళ్లారు.
ఈ క్రమంలో గేటు వద్ద తీవ్ర తొక్కిసలాట జరిగి, పలువురు కార్యకర్తలు కిందపడిపోయారు. పోలీసులను కూడా ఖాతరు చేయకుండా వైసీపీ శ్రేణులు తోసుకురావడంతో, అక్కడ విధుల్లో ఉన్న ఒక ఎస్ఐతో పాటు కొందరు పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. అనుకోకుండా జరిగిన ఈ ఘటనతో రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో కొద్దిసేపు వాతావరణం ఉద్రిక్తంగా మారింది. పటిష్ట భద్రత నడుమ పోలీసులు అతికష్టం మీద పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.