ADR Report: నీతి, నిజాయితీగా ఉండేవారు ఒకప్పుడు రాజకీయాల్లోకి వచ్చేవారు. ఏ చిన్న తేడా వచ్చినా తమ పదవులకు రాజీనామా చేసేవారు నేతలు. అందుకే కొన్ని సందర్భాల్లో అప్పటి నేతలను ఈ తరం వారు గుర్తు చేసుకుంటారు. ప్రస్తుతం రాజకీయాలు మారిపోయాయి. ఎక్కువ కేసులున్నవారే రాజకీయాల్లోకి వస్తున్నారు. ఒకవేళ మచ్చలేకుండా ఉన్న నేతలపై ఏదో విధంగా కేసులు నమోదు చేస్తున్నట్లు సందర్భాలు కనిపిస్తున్నాయి. ఇందుకు కారణాలు చాలానే ఉన్నాయనుకోండి.
ఏడీఆర్ రిపోర్టు ప్రకారం..
తాజాగా ఏడీఆర్ రిపోర్టు ప్రకారం.. దేశంలో ఎమ్మెల్యేల్లో 45 శాతం మంది నేతలపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. 28 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో 1,861 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్-ADR పేర్కొంది. ఎన్నికల సమయంలో నేతలు సమర్పించిన అఫిడవిట్లను విశ్లేషించి ఈ నివేదిక రూపొందించింది.
దేశవ్యాప్తంగా 4123 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో 24 మంది సభ్యుల అఫిడవిట్లు సరిగ్గా స్కాన్ చేయలేదు. వాటి కారణంగా వాటిని విశ్లేషించలేదు. దేశంలోని 4092 మంది ఎమ్మెల్యేల్లో 1,861 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు తేల్చింది. పర్సెంటేజ్ ప్రకారం చూస్తే 45 శాతం అన్నమాట. అందులో 29 శాతం ఎమ్మెల్యేలపై హత్య, హత్యాయత్నం, అపహరణ, మహిళలపై నేరాలు లాంటి తీవ్ర అభియోగాలు ఉన్నాయి.
దాదాపు 1,205 మంది ఎమ్మెల్యేలు. మరో 127 మంది ఎమ్మెల్యేలపై మహిళలపై నేరాలకు పాల్పడిన కేసులు ఉన్నాయి. మరో 13 మంది నేతలపై అత్యాచారం కేసులు లేకపోలేదు. 28 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో అత్యధిక కేసులున్న రాష్ట్రం ఏది. తక్కువ ఉన్న రాష్ట్ర ఏది? అన్నదే అసలు పాయింట్.
ALSO READ: వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
టాప్లో ఏపీ
ఏపీ ఎమ్మెల్యేలపై అత్యధిక కేసులున్నట్లు ఆ నివేదిక సారాంశం. 175 ఎమ్మెల్యేల్లో ఏకంగా 138 మందిపై క్రిమినల్ అభియోగాలు ఉన్నాయి. దాదాపు 79 శాతం అన్నమాట. ఈ లెక్కన ఏపీ అగ్రస్థానంలో నిలిచింది. సెకండ్ ప్లేస్లో కేరళ-తెలంగాణలు సంయుక్తంగా ఉన్నాయి. దాదాపు 69 శాతం శాతం మందిపై ఈ తరహా కేసులున్నాయి.
ఇక బీహార్-66 శాతం, మహారాష్ట్ర-65 శాతం, తమిళనాడు-59శాతం ఎమ్మెల్యేలపై క్రిమినల్ అభియోగాలు ఉన్నాయి. తీవ్ర నేరం అభియోగాల్లో ఏపీయే టాప్. 56 శాతం ఎమ్మెల్యేలపై ఇలాంటి అభియోగాలు ఉన్నాయి. దాదాపు 98 మంది నేతలపై ఇలాంటివి నమోదు అయ్యాయి. తెలంగాణలో 50 శాతం, బీహార్లో 49 శాతం, ఒడిషాలో 45 శాతం, ఝార్ఖండ్లో 45 శాతం ఎమ్మెల్యేలపై తీవ్రమైన నేరాలు మోపబడ్డాయి.
పార్టీల వారీగా
పార్టీల ప్రకారం క్రిమినల్ కేసుల జాబితాను ఒక్కసారి పరిశీలిద్దాం. 1653 మంది బీజేపీ ఎమ్మెల్యేల్లో 638 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. దాదాపు 39 శాతం ఇది. వీరిలో 436 మంది తీవ్ర నేరాభియోగాలు ఉన్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీకి చెందిన 646 ఎమ్మెల్యేలలో 339 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. అంటే దాదాపు 52 శాతం అన్నమాట. వీరిలో 194 మందిపై తీవ్ర నేరాభియోగాలున్నాయి.
టీడీపీకి చెందిన 134 మందిలో 115 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. అందులో 82 మందిపై తీవ్ర నేరాభియోగాలు ఉన్నాయి. తమిళనాడు డీఎంకే పార్టీ 132 మందికి గాను 98 మంది నేతలపై క్రిమినల్ కేసులున్నాయి. వీరిలో 42 మందిపై తీవ్ర నేరాభియోగాలు ఉన్నాయి. బెంగాల్కు చెందిన టీఎంసీకి చెందిన 230 మంది ఎమ్మెల్యేలలో 95 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. వీరిలో 78 మందిపై తీవ్ర నేరాభియోగాలు ఉన్నాయి.
ఏఏపీకి చెందిన 123 మంది ఎమ్మెల్యేలలో 69 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. వీరిలో 35 మందిపై తీవ్ర నేరాభియోగాలు నమోదు అయ్యాయి. చివరి స్థానంలో మహారాష్ట్రకు చెందిన శరద్ పవార్ పార్టీ-NCP ఉంది. ఆ పార్టీకి చెందిన ఎనిమిది ఎమ్మెల్యేల్లో ఐదుగురిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. నాలుగురిపై తీవ్ర నేరాభియోగాలు ఉన్నట్లు ప్రస్తావించింది.