ఏపీ రాజకీయాల్లో రాజధాని అమరావతి అంశం మరోసారి చిచ్చు రేపింది. మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమరావతిపై చేసిన వ్యాఖ్యలకు గానూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన కౌంటర్లతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
జగన్పై సీఎం చంద్రబాబు సెటైర్లు
టీడీపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన మీడియా చిట్చాట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. వైఎస్ జగన్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నదీ గర్భం అంటే ఏంటో, నదీ పరివాహక ప్రాంతం అంటే ఏంటో కూడా జగన్కు తెలియదని ఎద్దేవా చేశారు. అమరావతిపై జగన్ మళ్లీ అసత్య ప్రచారాలు మొదలుపెట్టారని.. గత ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పినప్పటికీ రాజధానిపై విషం చిమ్మడం మానలేదని మండిపడ్డారు. మిగులు జలాలను వినియోగించుకోవడం ఎలా తప్పవుతుందో జగన్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రపంచంలోని అనేక గొప్ప నగరాలు నదీ తీరాల్లోనే అభివృద్ధి చెందాయని చంద్రబాబు గుర్తు చేశారు. ప్రాచీన సింధు నాగరికత నుంచి నేటి ఢిల్లీ, లండన్ వంటి ప్రముఖ నగరాల వరకు అన్నీ నదుల పక్కనే వికసించాయని ఆయన ఎగ్జాంపుల్ గా పేర్కొన్నారు. అమరావతి భౌగోళిక స్థితిగతులపై అవగాహన లేకుండా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. జగన్ తన పాలనలో రాయలసీమకు తీరని ద్రోహం చేశారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు రాజధానిపై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు.
మంత్రుల ఘాటు స్పందన
జగన్ వ్యాఖ్యలపై ఇప్పటికే కూటమి ప్రభుత్వంలోని మంత్రులు, నేతలు ఘాటుగా స్పందించారని చంద్రబాబు తెలిపారు. అమరావతికి వ్యతిరేకంగా వైసీపీ చేస్తున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఇకనైనా ఇలాంటి అసత్య ప్రచారాలను మానుకోవాలని సూచించారు. రాజధాని నిర్మాణాన్ని అడ్డుకునేందుకు జగన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా నిర్మించి తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ALSO READ: Stroke Risk: స్ట్రోక్ లక్షణాలను ముందే గుర్తించడం ఎలా? ఈ చిట్కాలతో ప్రాణాలను కాపాడొచ్చు !