BCCI: టీమిండియాకి ఆడాలంటే దేశవాళి టోర్నీలు ఆడాల్సిందే..! బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫెయిల్యూర్ తర్వాత బీసీసీఐ తీసుకు వచ్చిన కొత్త నిబంధన ఇది. భారత జట్టులోకి ఎంట్రీ ఇస్తే చాలు.. ఇక దేశవాళిల్లో ఆడాల్సిన అవసరం లేదని ఫీల్ అయిపోయిన క్రికెటర్లకు ఈ రూల్ తో గట్టి షాక్ తగిలింది. అప్పుడెప్పుడో 9 సంవత్సరాల క్రితం దేశవాళీ క్రికెట్ ఆడిన టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు.. 13 ఏళ్ల పాటు దేశవాళి మ్యాచులు ఆడిన విరాట్ కోహ్లీ ఈ ఏడాది ప్రారంభంలో రంజీ మ్యాచ్ లు ఆడారు.
అయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టి-20, టెస్ట్ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించి ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. అయితే వీరు టీం ఇండియాకు ఆడాలి అంటే.. దేశవాళిల్లో పాల్గొనాల్సిందేనని వీరికి బీసీసీఐ సందేశం పంపింది. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ డిసెంబర్ 24 నుండి ప్రారంభం కానున్న విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొనే అవకాశం ఉంది.
రోహిత్ శర్మ – విరాట్ కోహ్లీకి బీసీసీఐ స్పష్టమైన సందేశం పంపింది. భారత్ కోసం ఆడాలంటే తప్పకుండా దేశవాళిల్లో ఆడాల్సిందేనని తేల్చిచెప్పింది. వన్డేల్లో ఆడాలంటే మ్యాచ్ ఫిట్నెస్ కోసం వారు దేశవాళీల్లో ఆడాలని ఓ బీసీసీఐ అధికారి పేర్కొన్నారు. లేదంటే జట్టులో చోటు కష్టమేనని స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో తాను విజయ్ హజారే ట్రోఫీలో ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్లు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ముంబై క్రికెట్ అసోసియేషన్ కి సమాచారం అందించినట్లు క్రీడా వర్గాలు చెబుతున్నాయి. నవంబర్ 26 నుండి ప్రారంభం కాబోతున్న సయ్యద్ ముస్తక్ అలీ టీ-20 టోర్నమెంటులో కూడా పాల్గొనేందుకు తాను ఆసక్తిగా ఉన్నానని {MCA} కి తెలిపాడు రోహిత్ శర్మ. ఇక సౌత్ ఆఫ్రికా – భారత్ మధ్య నవంబర్ 30 నుండి వన్డే సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో అతడు సయ్యద్ ముస్తక్ అలీ టోర్నమెంట్ లో చాలా తక్కువ మ్యాచులు మాత్రమే ఆడే అవకాశం ఉంది.
విరాట్ కోహ్లీ విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొంటాడా..? లేదా..? అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. కోహ్లీ చివరిసారిగా 2010లో ఢిల్లీ తరఫున ఈ టోర్నీలో పాల్గొన్నాడు. క్రీడావర్గాల సమాచారం ప్రకారం బీసీసీఐ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పై కఠినమైన విధానాన్ని అవలంబిస్తోంది. ఈ ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు దేశవాలి క్రికెట్ లో పాల్గొనకపోతే రాబోయే 2027 ప్రపంచ కప్ జట్టులో వీరిని ఎంపిక చేయమని స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ వార్త క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది.
కొన్ని సంవత్సరాలుగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు తరచుగా విశ్రాంతి పేరుతో కొన్ని అంతర్జాతీయ సిరీస్ లకు దూరంగా ఉండేవారు. ఈ సమయంలో వారు దేశవాళీ టోర్నమెంట్లకు కూడా దూరంగా ఉండేవారు. కానీ యువ ఆటగాళ్లు తమ స్థానాల కోసం దేశవాళీ టోర్నీలో కష్టపడేవారు. అయితే ఇప్పుడు బీసీసీఐ ఈ విధానానికి చెక్ పెట్టింది. ఎంత పెద్ద పేరున్న ఆటగాడైనా సరే.. దేశవాళి క్రికెట్ కి దూరంగా ఉండకూడదని బోర్డు స్పష్టం చేసింది. ఈ కఠిన వైఖరి భారత జట్టులో క్రమశిక్షణను పెంచడానికి, పోటీ వాతావరణాన్ని సృష్టించడానికి ఉద్దేశించబడింది. 2027 ప్రపంచ కప్ టోర్నమెంట్ లో ఆడాలంటే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇప్పుడు తమ ఆటతో తమను తాను నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది.
🚨 BCCI'S MESSAGE TO KOHLI & ROHIT – THEY MUST TO PLAY VIJAY HAZARE 🚨
– The BCCI & team management have conveyed to Virat Kohli & Rohit Sharma that they will have to play domestic cricket one-dayers if they want to play for India. (The Indian Express). pic.twitter.com/8pUH1wTvDx
— Tanuj (@ImTanujSingh) November 12, 2025