AP Budget 2026: ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం నేడు శాసన సభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. రాష్ట్ర భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే బడ్జెట్ ను వరుసగా మూడోసారి ప్రవేశపెట్టేందుకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సిద్ధమయ్యారు. సుమారు రూ.3.40 లక్షల కోట్ల అంచనాలతో ఈసారి బడ్జెట్ స్వరూపం ఉండనున్నట్లు తెలుస్తోంది. అటు శాసన మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనుండటం గమనార్హం.
శనివారం ఉదయం 11.40 గంటలకు అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ ప్రతులను విజయవాడ కనకదుర్గ ఆలయానికి ఆర్థిశాఖ ఉన్నతాధికారులు తీసుకెళ్లారు. పీయూష్, రోనాల్డ్ రోస్, సూరాజ్ కున్వారియా, గౌతమ్ అల్లాడ ఈ ప్రతులను తీసుకెళ్లి.. అమ్మవారి పాదల చెంత పెట్టారు. ప్రత్యేక పూజలు చేయించారు. మరోవైపు రాష్ట్ర బడ్జెట్ ప్రతులతో వచ్చిన ఆర్థిక శాఖ అధికారులు.. ఆలయ నిర్వాహకులు సాదర స్వాగతం పలికారు.
బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు ఏపీ అసెంబ్లీలో కేబినేట్ భేటి జరగనుంది. ఉదయం 10.30 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు సమావేశం కానున్నారు. బడ్జెట్ లో కేటాయింపులకు సంబంధించి వీరి మధ్య చర్చ జరగనుంది. అనంతరం వార్షిక బడ్జెట్ కు మంత్రులు ఆమోదం తెలుపనున్నారు. ఈ భేటి పూర్తికాగానే.. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.. శాసన సభలో బడ్జెట్ ను ప్రవేశపెడతారు. మరోవైపు వ్యవసాయ, అనుబంధ రంగాలకు సంబంధించి బడ్జెట్ ను మంత్రి అచ్చెన్నాయుడు సభ ముందుకు తీసుకొస్తారు. అటు మండలిలో వ్యవసాయ బడ్జెట్ ను అనగాని సత్యప్రసాద్ ప్రవేశపెట్టనున్నారు.
2026-27 వార్షిక బడ్జెట్ లో అమరావతి, పోలవరం ప్రాజెక్టుకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే సూపర్ సిక్స్ పథకాలకు గణనీయంగా కేటాయింపులు జరిగే అవకాశముంది. మరోవైపు మూడు ఆర్థిక జోన్లు, రాయలసీమ ఉద్యానహబ్ లాంటి అంశాలకు బడ్జెట్ లో ప్రాధాన్యం లభించవచ్చు. అదే సమయంలో రైతుల సంక్షేమానికి వ్యవసాయ బడ్జెట్ లో ఏపీ ప్రభుత్వం పెద్ద పీట వేయనున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఉభయ సభలు వాయిదా పడనున్నాయి. రేపు, ఎల్లుండి ఎలాంటి సభలు నిర్వహించారు. తిరిగి ఈ నెల 17న బడ్జెట్ లో చర్చ మెుదలవుతుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
Also Read: Telangana Municipal Elections: మున్సిపాలిటీల్లో బ్రహ్మరథం.. కాంగ్రెస్కే పట్టం కట్టిన పట్టణ ఓటర్లు!