Andhra Pradesh: ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం రైతుల పరిస్థితిపై ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్రంలో రైతులు గిట్టుబాటు ధరలు లేక, ఆర్ధిక ఇబ్బందులతో అల్లాడుతుంటే.. ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. ముఖ్యంగా మంత్రులు సింగపూర్ పర్యటనలకు వెళ్లడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ‘రైతులను ఆదుకోవడానికి ఖజానాలో నిధులు లేవని చెప్పే పాలకులు, మంత్రులు విహారయాత్రలకు , షికార్లకు మాత్రం కోట్లాది రూపాయలు ఎలా ఖర్చు చేస్తున్నారు?’ అంటూ అప్పిరెడ్డి సూటిగా ప్రశ్నించారు.
వ్యవసాయం అంటేనే చంద్రబాబుకు చిన్న చూపు అని, గతంలో ఆయన రాసిన మనసులో మాట పుస్తకంలో వ్యవసాయం దండగ అన్న విషయాన్ని అప్పిరెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో మామిడి, ధాన్యం, పత్తి, మిర్చి, ఉల్లి, టమాటా వంటి ఏ పంటకూ సరైన మద్దతు ధర లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం రైతుల సమస్యలపై సమీక్ష చేయడానికి కూడా ముఖ్యమంత్రికి సమయం లేదా అని ఆయన నిలదీశారు. రాష్ట్రంలో వ్యవసాయ శాఖ అసలు ఉందో లేదో తెలియని అయోమయ స్థితి నెలకొందని విమర్శించారు.
లక్షల కోట్ల రూపాయల అప్పులు తెస్తున్న ప్రభుత్వం, ఆ నిధులను ఏం చేస్తోందని అప్పిరెడ్డి ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాన్ని ప్రభుత్వాలు రైతులను అండగా నిలుస్తుంటే, ఆంధ్రప్రదేశ్లో మాత్రం అన్నదాతలను గాలికొదిలేశారని ఆరోపించారు. రైతులకు మేలు చేసింది కేవలం వైఎస్సార్ కుటుంబమేనని.. ఉచిత విద్యుత్ పథకం నుంచి రైతు భరోసా కేంద్రాల వరకు వైఎస్సార్, జగన్ హయాంలోనే విప్లవాత్మక మార్పులు వచ్చాయని పేర్కొన్నారు. రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ఈ ప్రభుత్వం, త్వరలోనే అన్నదాతల కన్నీళ్లలో కొట్టుకుపోక తప్పదని ఆయన హెచ్చరించారు. మెుత్తానికి, అప్పిరెడ్డి వ్యాఖ్యలు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు రైతు పక్షపాతిగా వైఎస్సార్ కాంగ్రెస్ ముద్రను బలపరిచేలా ఉన్నాయి.
Also Read: ఆర్టీసీ కార్మికులకు మంత్రి సీతక్క ‘ఆత్మీయ పిలుపు’.. సమ్మె విరమించాలని విజ్ఞప్తి!