Sanjeevini Project: ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలికింది. ప్రతి పేదవాడికి అత్యాధునిక వైద్య సేవలు ఉచితంగా అందించడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం సరికొత్త అడుగులు వేస్తోంది. 2047 నాటికి రాష్ట్రంలోని ప్రతి కుటుంబాన్ని ‘హ్యాపీ, హెల్దీ, వెల్తీ’ ఫ్యామిలీగా మార్చాలనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంకల్పానికి ఈ ప్రాజెక్ట్ నిదర్శనం. ఈ మేరకు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి రాష్ట్రంలో అమలు కాబోతున్న ప్రతిష్టాత్మక ‘సంజీవిని ప్రాజెక్ట్’ వివరాలను వెల్లడించారు.
ముందస్తు పరీక్షలు.. ప్రాణాల రక్షణ
క్యాన్సర్, గుండె జబ్బులు, షుగర్, రక్తనాళాల బ్లాకేజెస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను ముందే గుర్తించి ప్రాణాలు రక్షించడమే ఈ సంజీవిని ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం. ఇందుకోసం 104 మొబైల్ ల్యాబ్ వాహనాల ద్వారా ప్రతి ఒక్కరికీ ఉచితంగా రక్త పరీక్షలు, ఇతర నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తారు. ఇప్పటికే కుప్పం, చిత్తూరు ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద దాదాపు 19 లక్షల మందికి ఉచిత పరీక్షలు విజయవంతంగా పూర్తి చేశారు. ఈ ఏడాది ఆగస్టు 15 నాటికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది.
Also Read: మెగా డీఎస్సీ ఏమైంది? కాంగ్రెస్ ప్రభుత్వంపై జీవన్ రెడ్డి ఫైర్!
డిజిటల్ హెల్త్.. నిపుణుల సలహాలు
ఈ ప్రాజెక్ట్ ద్వారా పరీక్షలు చేయించుకున్న ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలను ‘ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్’ ద్వారా డిజిటలైజ్ చేస్తారు. ఇది భవిష్యత్తు చికిత్సలకు ఎంతో ఉపయోగపడుతుంది. పరీక్షల అనంతరం ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు గుర్తిస్తే.. ఏఐ (AI), డేటా సెంటర్స్, వీడియో కాల్స్ సాంకేతికత ద్వారా నిపుణులైన డాక్టర్లతో రోగులకు నేరుగా ఉచిత వైద్య సలహాలు అందిస్తారు.
రూ. 25 లక్షల ఉచిత వైద్యం..
కేవలం పరీక్షలకే పరిమితం కాకుండా, వ్యాధి నయమయ్యే వరకు ఉచితంగా మందులు అందిస్తూ ప్రభుత్వం బాధితులకు వెన్నంటి ఉంటుంది. అవసరమైన వారికి ఆయుష్మాన్ భారత్, ఎన్టీఆర్ వైద్యసేవ ద్వారా రూ. 25 లక్షల వరకు ఉచిత సర్జరీలు, వైద్య సహాయం అందిస్తారు. ప్రపంచ ప్రసిద్ధ ‘గేట్స్ ఫౌండేషన్’ భాగస్వామ్యంతో దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఈ విప్లవాత్మక ప్రాజెక్ట్ అమలు కాబోతోంది.
దీనికి తోడు రాష్ట్రంలో ప్రమాదాలు జరిగిన వెంటనే స్పందించేందుకు వీలుగా 300కు పైగా సరికొత్త, అత్యాధునిక 108 వాహనాలను కూడా అందుబాటులోకి తెస్తున్నారు. మీ ప్రాంతానికి 104 సంజీవిని వాహనం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ ఉచిత పరీక్షలు చేయించుకుని ఈ అద్భుత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గళ్ళా మాధవి పిలుపునిచ్చారు.
Also Read:అల్లుడితో అక్రమ సంబంధం.. అడ్డువచ్చాడని భర్తను కిరాతకంగా చంపిన భార్య!