Fake Love Trap Case: పెళ్లిళ్లు పవిత్ర బంధంగా చెబుతారు. కానీ కొంతమందికి ఈ బంధం ఆటవిడుపుగా మారుతుందా? ప్రేమ పేరుతో నాటకం ఆడుతున్నారా? ఒక గ్రామంలో పెళ్లి అంటే కేవలం డబ్బు దోచుకునే మాదిరిగా చేస్తున్న ఓ కుటుంబ వ్యవహారం ఇప్పుడు కోనసీమ మొత్తాన్ని ఊపేస్తోంది. ప్రేమలో పడినట్లు నటించి, అనంతరం మోసం చేస్తున్న మహిళ కథ ఇప్పుడు పోలీస్ స్టేషన్లకే కాదు, పక్కా కుటుంబాల హృదయాలకు దెబ్బతీస్తోంది. ఇక అసలు విషయంలోకి వెళితే..
ఎక్కడైనా పురుషులు ఒకటికి మించి పెళ్ళిళ్ళు చేసుకొని మోసగించిన ఘటనలు వెలుగులోకి వస్తుంటాయి. కానీ ఇప్పుడు ఓ మహిళ చేసిన నిర్వాకం తెలిసి సమాజం నివ్వెర పోయింది. ఈమె యవ్వారం పోలీసుల దృష్టికి వెళ్ళగా, పోలీసులు సైతం ఆశ్చర్యానికి లోనయ్యారు. అలాగే 12 మందిని సదరు మహిళ పెళ్లి చేసుకొని మోసగించినట్లు ప్రచారం సాగడంతో, ఆ తీరున దర్యాప్తు సాగుతోంది.
పూర్తి వివరాలలోకి వెళితే..
అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం ప్రాంతానికి చెందిన బేతి వీరదుర్గానీలిమ అనే యువతి పేరుతో కొనసాగుతున్న ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈమె తల్లి వీరలక్ష్మి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి వ్యూహాత్మకంగా మగవారిని లక్ష్యంగా చేసుకుంటూ డబ్బులు గుంజుతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నీలిమ బృందం ప్రధానంగా టార్గెట్ చేస్తున్నది, విడాకులు తీసుకున్న లేదా భార్యాభర్తల మధ్య విభేదాలున్న కుటుంబాలు. అందులోనూ మగవారు ఉద్యోగాలు చేసి, బాగా సంపాదిస్తున్న వారు అయితే ఇక వారి జేబులు ఖాళీ చేయడం ఈమెకు చిన్న విషయం. మొదట ప్రేమ పేరుతో దగ్గర కావడం, ఆపై పెళ్లి మాయ మాటలతో మమేకం కావడం, చివరికి డబ్బు డిమాండ్ చేయడం, డబ్బు ఇవ్వకపోతే బ్లాక్మెయిల్ చేయడం ఇలా ప్లాన్ ప్రకారమే దాడులు జరిగాయని పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి.
ఇప్పటి వరకు మొత్తం 12 మందికి పైగా బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, నరసాపురం, పాలకొల్లు, కొవ్వూరు ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారు. వారు సోమవారం మధ్యాహ్నం స్వయంగా కోనసీమ ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించారు. తమకు జరిగిన అన్యాయాన్ని వివరంగా తెలియజేశారు. నీలిమ, ఆమె కుటుంబ సభ్యులు తమతో ఎంత మంది మగవారిని మోసం చేశారో చెప్పి, న్యాయం చేయాలని కోరారు.
Also Read: Rushikonda Palace: విశాఖ రుషికొండ ప్యాలెస్.. మళ్లీ వార్తల్లోకి.. త్వరలోనే అసలు ముహూర్తం?
ఇందులో విశేషం ఏమిటంటే, బాధితులంతా ఒక్కసారి కాదు.. ఒకే తరహాలో, ఒకే స్టైల్లో మోసపోయారు. దీని వెనక నీలిమకు స్థానిక రాజకీయ నేతల మద్దతు ఉందంటూ పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణంగా బాధితులు మరింత అసహనానికి లోనవుతున్నారు.
ఇప్పుడు నీలిమ, ఆమె తల్లి వీరలక్ష్మి అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు సమాచారం. కంప్లైంట్లు పెరుగుతుండటంతో పరిస్థితి అదుపు తప్పకుండా ఉందని తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారం పోలీసు అధికారుల ముందుకు చేరిన నేపథ్యంలో వారు ఎలా స్పందిస్తారు, ఎలాంటి విచారణ చేపడతారన్నది కీలకం కానుంది.
ఇలాంటి ఘటనలు ఇప్పటివరకు పురుషుల వల్ల జరిగేవని భావిస్తే, ఇప్పుడు ఓ మహిళ ఆ పని చేస్తోంది. ఈ వ్యత్యాసం గోదావరి జిల్లా ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రేమ పేరుతో మోసాలు, పెళ్లి పేరుతో వ్యాపారం చేసే వారు పెరిగిపోతున్న నేపథ్యంలో, యువత ప్రత్యేకంగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.