Delhi Politics: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య తరహాలోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పుడు కల్తీ మద్యం దందాను నడిపారని పార్టీ ఎంపీలతో సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. క్రిమినల్ మాస్టర్ మైండ్ ఎలా ఉంటుందన్నదానికి జగనే ఉదాహరణ అని చంద్రబాబు అన్నట్లు సమాచారం.
ఎంపీలకు సీఎం చంద్రబాబు సూచన
సోమవారం సాయంత్రం ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అనంతరం చంద్రబాబు తన అధికారిక నివాసంలో పార్టీ ఎంపీలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వివేకానంద హత్య కేసు మాదిరిగానే నకిలీ మద్యం కేసును టీడీపీపై నెట్టేందుకు కుట్రలు చేస్తున్నారని అన్నారు. ఏపీలో అలజడి సృష్టించేందుకు జగన్ అండ్ కో ప్రయత్నాలు చేస్తోందని అన్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు.
వైసీపీ వాళ్ల క్రిమినల్ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. మూర్ఖుడు, క్రూరుడు లాంటి పదాలు జగన్ అండ్ కోకు వర్తిస్తాయని అన్నారు. నేర కార్యకలాపాలకు అంతులేదని, పార్టీ అంతా క్రిమినల్ కార్యకలాపాలకు అడ్డాగా మారిందని విమర్శించారు. వైసీపీ నేతలు నేరాలు చేసి తెలుగుదేశం మీదకు నెట్టడం పరిపాటిగా మారిందని ఆరోపించారు.
వైసీపీతో జాగ్రత్త అంటూ
ఈ విషయంలో అలర్ట్ గా ఉండాలని నేతలకు సూచనలు చేశారట. కల్తీ మద్యం దర్యాప్తులో లోతుగా వెళ్తున్న కొద్దీ అనేక విషయాలు బయటపడుతున్నాయని చెప్పారట. అంతకుముందు నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు జనార్థన్రెడ్డి వీడియో బయటకు వచ్చింది. నకిలీ మద్యం వెనుక మాజీ మంత్రి జోగి రమేష్ ఉన్నారని అందులో ప్రస్తావించాడు.
ALSO READ: హైకోర్టు సీరియస్.. తిరుమలలో సీఐడీ ఐడీ
దీనిపై ఏపీ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న సమయంలో ఎంపీలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ కేసుకు వెనుక అసలు సూత్రదారులు ఎవరన్నది బయటకు వస్తున్నట్లు చెప్పారు. నేతలు ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలని సూచన చేసినట్టు సదరు ఎంపీలు చెబుతున్నారు. నకిలీ మద్యం.. మద్యం కుంభకోణం ఈ రెండు ఒక్కటేనని అంటున్నారు.
రేపటి రోజున నకిలీ మద్యం వెనుక పెద్ద తలకాయలు బయటపడడం ఖాయమని అంటున్నారు. ఆదివారం రాత్రి మీడియా ముందుకొచ్చిన సీఎం చంద్రబాబు, నకిలీ మద్యంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయని చెప్పుకొచ్చిన విషయం తెల్సిందే.