YSRCP Social Media Activist: సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్లు.. తెరవెనుక ఉండి పెట్టించిన వాళ్లు ఇలా అందరి భరతం పడుతున్నారు ఏపీ పోలీసులు. చిన్నా పెద్దా అన్న తేడా లేదు. తేడాగా పోస్టులు పెట్టిన ఎవరైనా సరే బుక్ అవుతున్నారు. సజ్జల భార్గవ్, పోసాని, ఆర్జీవీ, శ్రీరెడ్డిపై ఇప్పటికే కంప్లైంట్లు వెల్లువెత్తాయి. కేసులు నమోదయ్యాయి కూడా. ఇందులో కొందరు క్షమాపణలు చెప్పినా ఉపయోగం లేకుండా పోయింది.
టీడీపీ, జనసేన నేతల కంటే వారి భార్యలే టార్గెట్ గా సోషల్ మీడియాలో వైసీపీ సానుభూతి పరులు చాలా అసభ్య పోస్టులు పెట్టారు. అందరి దృష్టిలో పడాలని కొందరు.. కావాలనే ఇంకొందరు ఇలాంటి పోస్టులతో సోషల్ మీడియాను కలుషితం చేసేశారు. రాజకీయాలతో సంబంధం లేని వారిని కూడా ఇందులోకి లాగారు. ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ కుటుంబ సభ్యులపై పెట్టిన పోస్టులు అన్నీ ఇన్నీ కావు. అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా చెల్లుతుందనుకున్నారు. కానీ ఇప్పుడు అలా కాదు కదా. ఎవరి లెక్కలు వారికి ఇచ్చేసే పనిలో పోలీసులు ఉన్నారు.
సజ్జల భార్గవ్, పోసాని కృష్ణమురళి, రాంగోపాల్ వర్మ, యాంకర్ శ్యామల, యూట్యూబర్ శ్రీరెడ్డి, వర్రా రవీందర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, ఇలాంటి వారి ఆటకట్టిస్తున్నారు. కంప్లైంట్లు రావడం, వెంటనే కేసులు నమోదవడం, విచారణకు పిలుస్తుండడం చకచకా జరిగిపోతున్నాయి. కాబట్టి ఇన్నాళ్లూ తప్పు చేసిన వాళ్లను చట్టం ముందు నిలబెడుతున్నారు. ఇకపై ఇలాంటి తప్పులు రిపీట్ కాకుండా పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకూ కౌన్సెలింగ్ ఇస్తున్నారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడేలా పోస్టులు పెట్టినా, మరొకరికి పంపినా ఇబ్బందులో పడుతారని వార్నింగ్ ఇస్తున్నారు. సైబర్ హిస్టరీ షీట్లలో చిక్కుకుని భవిష్యత్ నాశనం చేసుకోవద్దని విద్యార్థులు, నిరుద్యోగులకు గుర్తు చేస్తున్నారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాల్లో భాగమైతే సైబర్ బుల్లీస్ షీట్ తెరుస్తామని, అదే జరిగితే ఇక్కట్లు తప్పవంటున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా వర్రా రవీందర్, సజ్జల భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డి లపై మరో ఎస్సీ ఎస్టీ కేసు నమోదు అయ్యింది. డిప్యూటీ సీఎం పవన్ పై అసభ్యకర పోస్టులు తొలగించాలని కోరగా.. కులం పేరుతో దూషిస్తూ చంపుతామని బెదిరించారంటూ సిద్ధవటం మండలం ఎస్ రాజంపేటకి చెందిన వెంకటాద్రి ఫిర్యాదు చేశారు. ఈనెల 8వ తేదీన ఫిర్యాదు నమోదవ్వగా.. కేసును నందలూరు నుంచి పులివెందులకు బదిలీ చేశారు.
Also Read: మూకుమ్మడిగా కేసులు.. కమ్ముకొస్తున్న కారు మబ్బులు.. దిక్కుతోచని స్థితిలో వైసీపీ
ఇప్పటికే వర్రాపై రాష్ట్ర వ్యాప్తంగా 40 కేసులు నమోదయ్యాయి. ఇక కుటుంబ సభ్యులను టార్గెట్గా చేస్తూ.. అసభ్యంగా పోస్టులు పెట్టడంలో వర్రా స్టైలే వేరని కూటమి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరుడుగా ఉన్న వర్రా.. బెదిరించడం, దందాలు నడపడంలో స్పెషలిస్ట్ అంటూ పోలీసులు అంటున్నారు.
ప్రస్తుతం ఈ వ్యవహారం ఏపీలో చర్చనీయాంశంగా మారింది. వర్రాను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు కడప రిమ్స్ ఆస్పత్రిలో మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించారు. దీంతోపాటు వైఎస్ సునీత కూడా పులివెందులలో ఫిర్యాదు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.