Actress Kasthuri: నటి కస్తూరికి కష్టాలు రెట్టింపు అయ్యాయి. ఆమెని అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఆమె దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది. పరారీలో ఉన్న కస్తూరి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.
నటి కస్తూరికి మద్రాసు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో బెయిల్ మంజూరు చేయాలని ఆమె దాఖలు చేసిన పిటిషన్ను కొట్టి వేసింది. గత వారం రోజులుగా పరారీలో ఉన్న కస్తూరి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.
అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కస్తూరిపై తెలుగు సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. వారం కిందట సమన్లు ఇచ్చేందుకు ఆమె ఇంటికి వెళ్ళిన పోలీసులు. అయితే ఆమె ఇంటికి తాళం వేసి ఉండడంతో గోడకు సమన్లు అంటించారు.
కస్తూరి ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో అజ్ఞాతంలో ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. ఈ క్రమంలో ఆమె ముందస్తు బెయిల్ కోసం నటి కస్తూరి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం, శుక్రవారం తీర్పు వెల్లడించింది.
ALSO READ: అంబులెన్స్లో మంటలు.. తృటిలో తప్పించుకున్న ఓ గర్బిణీ
కస్తూరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి, తెలుగు-తమిళులను వేరు చేసి ఎలా మాట్లాడతారని వ్యాఖ్యానించారు. ముందస్తు బెయిల్ పిటిషన్ ఆమోదయోగ్యం కాదని, అందువల్ల ఈ పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు తీర్పునిచ్చింది న్యాయస్థానం. మరోవైపు సుప్రీంకోర్టుకి వెళ్లేందుకు కస్తూరి సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి.
ఇటీవల తమిళనాడు కొన్ని సంఘాలు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి నటి కస్తూరి హాజరైంది. ఈ సందర్భంగా తమిళుల చరిత్రలోకి వెళ్లింది. తెలుగు ప్రజలు తమిళనాడుకు ఎలా వచ్చారో వివరించిన కస్తూరి, కీలక వ్యాఖ్యలు చేసింది.
అంతఃపురంలో మహిళలకు సేవ చేసేందుకు తెలుగువారు ఇక్కడికి వచ్చారంటూ వ్యాఖ్యానించింది. అలాంటివారు ఇక్కడ ఉన్నారని, వారు తమిళ బ్రహ్మణులు కాదంటూ తనదైనశైలిలో చెప్పుకొచ్చింది. దీనికి సంబందించిన కస్తూరి వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. పరిస్థితి గమనించిన ఆమె క్షమాపణలు చెప్పింది. అయినా తమిళనాడులో తెలుగు సంఘాలు మాత్రం వెనక్కి తగ్గలేదు.