AP Assembly: శాసనసభకు హాజరు కాకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే ప్రజాప్రతినిధులపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలకు రావడం ఎమ్మెల్యేల కనీస ధర్మమని, సభకే రానప్పుడు జీతాలు ఎందుకు తీసుకోవాలని ఆయన నిలదీశారు.
ప్రజా భాగస్వామ్యంతో వేడుకలు
స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవాలను కేవలం అధికారిక కార్యక్రమాలుగా కాకుండా ప్రజల పండుగలా నిర్వహించాలని నిర్ణయించినట్లు స్పీకర్ తెలిపారు. ఇందులో భాగంగా ఆగస్టు 14, 15 తేదీల్లో సామాన్య ప్రజలతో పాటు విద్యార్థులకు కూడా అసెంబ్లీలోకి అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించారు. ప్రతి ఒక్కరూ ఈ వేడుకల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
హాజరుకాని వారిపై వేటు వేయాలి
సభకు సభ్యులందరూ తప్పనిసరిగా హాజరుకావాలనే ఉద్దేశంతోనే ‘ఫేషియల్ రికగ్నిషన్’ విధానాన్ని తీసుకొచ్చామని అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు. సమావేశాలకు సరిగ్గా రాని వారిపై వేటు వేసేలా కఠినమైన చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో కేంద్రం నుంచి కూడా తగిన నిర్ణయం రావాల్సి ఉందన్నారు.
శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణకు కౌంటర్ ఇస్తూ.. ‘సభకు రాని వైసీపీ ఎమ్మెల్యేలతో బొత్స గారు రాజీనామా చేయించవచ్చు కదా?’ అని ప్రశ్నించారు. చట్టసభల్లో ప్రతిపక్ష హోదా ఉన్న నేతకు మాత్రమే ముఖ్యమంత్రితో సమానంగా మాట్లాడే అవకాశం ఉంటుందని, ప్రస్తుతం ఆ హోదా ఎవరికీ లేదని గుర్తుచేశారు.
17 నుంచి అసెంబ్లీ సమావేశాలు
ఈ నెల 17వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయని స్పీకర్ వెల్లడించారు. సభ నిర్వహణ, భద్రత తదితర ఏర్పాట్లపై ఆగస్టు 14న అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు.
Also Read: దేవరయాంజాల్లో ఘోర అగ్నిప్రమాదం.. 6 గంటలుగా ఎగిసిపడుతున్న మంటలు, కోట్ల ఆస్తి నష్టం!