Bihar Newlywed Death: వారిద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. నూరేళ్లు కలిసి జీవించాలని ఎన్నో కలలు కన్నారు. పెద్దలు వారి కలలకు అడ్డుతగలడంతో.. ఇంట్లో నుంచి పారిపోయిమరి పెళ్లి చేసుకున్నారు. దేవుడి ఆశీస్సులతో కొత్త జీవితం ప్రారంభించాలని నిర్ణయించుకొని గుడి వెళ్తుండగా ఒక్కసారిగా నవ వధువు కుప్పకూలి మరణించింది. యువతి బంధువుల ఫిర్యాదుతో వరుడు పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కాడు. బిహార్ లో జరిగిన ఈ విషాదకర ఘటన ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
అరరియా జిల్లా బుట్టర్బారీకి చెందిన మనీషా కుమారి (19) బీఏ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. అదే జిల్లాలోని పలాసికి చెందిన డిగ్రీ విద్యార్థి దిల్ఖుష్ కుమార్ (20)తో ఆమెకు ఏడాది క్రితం ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడింది. రోజూ మాట్లాడుకోవడంతో ఆ పరిచయం కాస్త.. ప్రేమగా మారింది. అయితే ఇటీవల మనీషా కుటుంబసభ్యులు ఆమెకు వేరొకరితో పెళ్లి నిశ్చయించారు. దీంతో ఆ పెళ్లి ఇష్టం లేని మనీషా.. ప్రేమికుడు దిల్ఖుష్తో కలిసి వెళ్లిపోయి కొత్త జీవితం ప్రారంభించాలని నిర్ణయించుకుంది.
సోమవారం (ఆగస్టు 10) ఉదయం అరరియా నుంచి బయలుదేరిన ఈ జంట మధ్యాహ్నానికి పూర్ణియా జంక్షన్కు చేరుకుంది. బంధువులెవ్వరూ లేకపోవడంతో ఎలాంటి హంగామా లేకుండా రైల్వే స్టేషన్ ప్రాంగణంలోనే దిల్ఖుష్ ఆమె నొసటన సిందూరం దిద్ది భార్యగా స్వీకరించాడు. ఆ క్షణంలో తమ పెళ్లికి సంబంధించిన ఫోటోను ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేశారు. ఆ రాత్రికి వారు రైల్వే స్టేషన్లోనే గడిపారు.
మరుసటి రోజు సాయంత్రం రాంబాగ్ నుంచి సిటీ కాళీ ఆలయానికి మొక్కులు తీర్చుకోవడానికి కాలినడకన వారిద్దరూ బయలుదేరారు. ఆ సమయంలో తీవ్రమైన ఎండ ఉండటంతో మనీషా కళ్లు తిరిగి కుప్పకూలిపోయింది. ఆందోళన చెందిన దిల్ఖుష్ స్థానికుల సాయంతో ఆమెను వెంటనే పూర్ణియాలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాడు. అయితే అక్కడ చికిత్స పొందుతూ ఆమె అనూహ్యంగా కన్నుమూసింది.
Also Read: యూట్యూబర్కు బిగ్ షాక్.. పెళ్లి అయిన ఏడాదికే.. కండక్టర్తో భార్య జంప్!
మరోవైపు కూతురు కనిపించకుండా పోవడంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఇన్స్టాగ్రామ్లో ప్రత్యక్షమైన పెళ్లి ఫోటో చూసి దిల్ఖుష్ ఇంటికి వెళ్లారు. కానీ అక్కడ వారికి ఎలాంటి సమాచారం దొరకలేదు. ఆ తర్వాత దిల్ఖుష్ స్నేహితుల ద్వారా మనీషా మరణించిన వార్త తెలుసుకొని ఆ కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. వెంటనే వారు దిల్ ఖుష్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆస్పత్రికి చేరుకొని.. దిల్ ఖుష్ ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మనీషా బాడీని పోస్ట్ మార్టంకి తరలించారు. పోస్ట్మార్టం నివేదిక వచ్చిన తర్వాతే మరణానికి గల అసలు కారణాలు తెలుస్తాయని అధికారులు పేర్కొన్నారు. దాని ఆధారంగా కేసులో తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు.
Also Read: జియో బిగ్ ఆఫర్.. రూ.2000తో ఏడాదంతా 15 ఓటీటీలు ఫ్రీ.. 1000 పైగా ఛానెళ్లు !