AP Govt Scheme: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి అయ్యింది. అన్నివర్గాలకు న్యాయం చేసేలా కొన్ని పథకాలను ప్లాన్ చేస్తున్నారు. ఏ ఒక్క వర్గానికి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. తాజాగా నియోజకవర్గం వారీగా కొత్త పథకం తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. ఇంతకీ ఆ పథకం ఏంటి?
దివ్యాంగులకు శుభవార్త చెప్పింది ఏపీ ప్రభుత్వం. 100 శాతం రాయితీతో వారికి మూడు చక్రాల వాహనాలు అందించాలని డిసైడ్ అయ్యింది. ఈ పథకానికి సీఎం చంద్రబాబు ఆమోదం ముద్ర వేయడంతో టెండర్ల ప్రక్రియను ప్రారంభించింది దివ్యాంగుల సంక్షేమ శాఖ. ఈ ఏడాదికి కాగాను ప్రతి నియోజకవర్గానికి 10 వాహనాలు ఇవ్వాలని భావిస్తోంది ప్రభుత్వం.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలకు కలిసి 1,750 వాహనాలను పంపిణీ చేయనున్నారు. అర్హులైన దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతోంది. మరో మూడు నెలల్లో లబ్దిదారులను గుర్తించి ఆయా వాహనాలు ఇవ్వాలని భావిస్తోంది.
మూడు చక్రాల వాహనం ఖరీదు ఒక్కో వాహనానికి దాదాపు లక్ష రూపాయల వరకు ఉంటుందని లెక్కలు వేస్తోంది ప్రభుత్వం. ఈ లెక్కన మొత్తం వాహనాలకు 17.50 కోట్ల రూపాయలు కేటాయించింది సర్కార్. తొలుత 875 వాహనాలు ఇవ్వనున్నారు. అందుకు సంబంధించి టెండర్లను పిలిచారు. ఆ ప్రక్రియ పూర్తి కాగానే అర్హుల్ని గుర్తించి ఆయా వాహనాలను అందజేయనున్నారు.
ALSO READ: జగన్ కాన్వాయ్ ఢీ కొని దళితుడు మృతి
ఆ తర్వాత అదే ధరకు మిగతా వాహనాలకు టెండర్లు పిలవనున్నట్లు ఆ శాఖ అధికారుల మాట. టెండర్ల ప్రక్రియ పూర్తి కాగానే లబ్దిదారుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించనుంది. దివ్యాంగులకు ఆయా వాహనాలు అందించేందుకు కొన్ని అర్హతలు పెట్టినట్టు తెలుస్తోంది.
18 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. తొలుత డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ చదివిన విద్యార్థులకు ప్రయార్టీ ఇవ్వనున్నారు. ఏడాది నుంచి సొంతంగా పని చేసుకుంటున్న వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు చెబుతున్నారు. అలాగే 70 శాతం అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారు ఈ పథకానికి అర్హులు.
ఏడాదికి ఆ కుటుంబం ఆదాయం మూడు లక్షల లోపు ఉండాలని అంటున్నారు. వైసీపీ హయాంలో ఒక్కసారి ఈ వాహనాలను పంపిణీ చేశారు. ఈ స్కీమ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 4 వేల మంది దరఖాస్తు చేసుకోవచ్చని అంచనా వేస్తోంది. ప్రభుత్వం ఇవ్వాలని భావిస్తున్న వాహనాలతో పాటుగా స్వచ్ఛంద సంస్థల సాయంతో మరో 60 మూడు వాహనాలు ఇచ్చే ప్రయత్నంలో ఉన్నారట అధికారులు.