Food Items In Amaravati: అమరావతి నిర్మాణమే అద్భుతం అనుకుంటే, ఇక్కడ రాజధాని పునః నిర్మాణానికి హాజరయ్యే ప్రజలకు అందించే మెనూ మరీ అద్భుతమట. రేపు ప్రధాని మోడీ చేతుల మీదుగా రాజధాని పునః నిర్మాణం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే భారీ బహిరంగ సభను ఈ సంధర్భంగా ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఆ సభకు వచ్చే ప్రజల కోసం సపరేట్ మెనూను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఆ మెనూ తెలుసుకుంటే ఔరా అనేస్తారు.
ఏపీ కూటమి ప్రభుత్వం మే 2 న అమరావతి రాజధాని నిర్మాణ పునః నిర్మాణ పనులను ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో, ఈ ప్రాజెక్టు ప్రజల రాజధాని గా గుర్తింపు పొందింది. ఈ పునర్నిర్మాణ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరై, రూ. 43,000 కోట్ల విలువైన పునర్నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లను ప్రభుత్వం పకడ్బందీగా నిర్వహిస్తోంది.
రైతులకు ప్రత్యేక ఆహ్వానం..
అమరావతి పనుల పునఃప్రారంభ కార్యక్రమానికి రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని రైతులను ఆహ్వానించారు. మే 2వ తేదీ రాష్ట్ర చరిత్రలో కీలకమైన మలుపు కానుంది. రాష్ట్ర అభివృద్ధిలో రాజధాని నిర్మాణం కీలక అడుగు అవుతుందని సీఎం అన్నారు. రాజధాని రైతుల త్యాగం వల్లే నేడు ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మిస్తున్నామని, రైతుల మంచి మనసును రాష్ట్ర ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారని వారు అన్నారు.
రాజధానిలో జరిగే ప్రతి కార్యక్రమంలో, పనుల్లో పాల్గొనాలని సీఎం చంద్రబాబు రాజధాని గ్రామాల రైతులను ఆహ్వానించారు. మే 2న ప్రధానమంత్రి రాజధాని పనుల పునఃప్రారంభ కార్యక్రమం, రైతుల విజయాలు, ఇబ్బందులను వారితో చర్చించారు. అమరావతి రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం తిరిగి కేటాయించిన ప్లాట్లకు బ్యాంకుల ద్వారా రుణాలు పొందేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
బొట్టు పెట్టి మరీ, ఆహ్వాన పత్రికలు..
ప్రధాని మోడీ సభకు ప్రతి అమరావతి రైతు హాజరయ్యేలా కూటమి నేతలు ఇంటింటికీ వెళ్ళి బొట్టు పెట్టి మరీ ఆహ్వానాలు అందించారు. అలాగే ఆహ్వాన పత్రికలు అందించి ప్రతి ఒక్కరూ ఈ పండగలో పాల్గొనాలని కోరారు. అయితే ఏపీ రాజధాని పునః నిర్మాణం కావడంతో రాష్ట్రంలోని పలు జిల్లాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు కూడా హాజరు కానున్నారు. అందుకు ప్రత్యేక బస్సులను సైతం సిద్ధం చేశారు. అలాగే ఆయా మంత్రుల సారథ్యంలో ఇప్పటికే ప్రధాని పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తుండగా, సభకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నారు.
ఇదేం మెనూ.. బాబోయ్..
సభకు వచ్చే ప్రజలకు అందించే మెనూను సైతం ప్రత్యేకంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు సమాచారం. బస్సులలో రాజధాని పునః నిర్మాణానికి వచ్చే ప్రజల కోసం స్పెషల్ మెనూ ఏర్పాటు చేశారు. ఆహార పొట్లాలు, అరటి పండ్లు, వాటర్ బాటిల్స్, సమ్మర్ సీజన్ కావడంతో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్స్ ఇలా ఏర్పాట్లు ఉన్నాయి. అంతేకాదు మధ్యాహ్నం వారికి భోజన సదుపాయం కూడా అందుబాటులో ఉంచనున్నారు. ఇక సభ ముగిసిన అనంతరం కూడా ప్రజలకు ఆహరాన్ని అందించే భాద్యతను పలువురు అధికారులకు ప్రభుత్వం అప్పజెప్పింది. రాత్రి వేళ కిచిడీ, చట్నీ, ఒక ఆరెంజ్ పండు అందించనున్నారు.
వైద్య ఆరోగ్య శాఖ విస్తృత వైద్య సేవలు..
ప్రధాని సభకు వచ్చే ప్రజల కోసం వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మొత్తం 30 వైద్య బృందాలు, అంబులెన్సులు, 3 తాత్కాలిక ఆసుపత్రులు ఎమెర్జెన్సీ స్పందనకు ఏర్పాట్లు చేశారు. వివిధ ప్రాంతాల్లో సూపర్ స్పెషాలిటీ, స్పెషాలిటీ వైద్యులతో కూడిన 30 వైద్య బృందాల ఏర్పాటు చేయగా, పలు చోట్ల అందుబాటులో అడ్వాన్స్డ్ లైఫ్ సిస్టమ్స్ తో కూడిన 6 అంబులెన్సులు, బేసిక్ లైఫ్ సిస్టమ్స్ కూడిన మరో 21 అంబులెన్సులు ఉంటాయి.
Also Read: Viral Video : ఏపీలో పాకిస్తాన్ మద్దతుదారులు.. పాక్ జెండాలతో.. రంగంలోకి ధర్మ రక్షాదళ్
సభాస్థలి ప్రాంతంలో ఒక్కోటి 10 పడకలతో కూడిన 3 తాత్కాలిక ఆసుపత్రులు, అదనంగా అందుబాటులో 20 మెడికల్ క్యాంపులు అందుబాటులో ఉంటాయి. 10 పడకల ఈ ఆసుపత్రులలో కార్డియాక్ డిఫిబ్రిలేటర్, గ్లూకో మీటరు, ఇసిజి మెషీన్, ఆక్సిజన్ సిలిండర్, నెబ్యులైజర్ వంటి 11 పరికరాలతో పాటు మందులు ఏర్పాటు చేశారు. సభకు హాజరయ్యే వారికి మజ్జిగ, ఒఆర్యస్ ద్రావకం ప్యాకెట్లను అందించడానికి ఎఎన్ఎంలు, ఆశా వర్కర్లతో కూడిన 31 బృందాల నియమించారు. మొత్తం మీద ప్రధాని సభను విజయవంతం చేసేలా ప్రభుత్వం అన్నీ చర్యలు తీసుకుంది.