AP High High Court on Skill Scam(AP political news):
స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై ఏపీ హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. దాదాపు 5 గంటలపాటు ఇరుపక్షాల వాదనలు సాగాయి. వాదనలు ముగిసిన తర్వాత తీర్పును న్యాయస్థానం రిజర్వు చేసింది. రెండు రోజుల్లో తీర్పు వెలువరించే అవకాశం ఉంది. ఈ కేసులో ఇరు పక్షాల తరఫున ఐదుగురు న్యాయవాదులు వాదనలు వినిపించారు. కీలక అంశాలను ప్రస్తావించారు.
అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17-A, అసలు ఆ డబ్బు ఎక్కడికి వెళ్లిందో ఆధారాలు చూపకపోవడం, నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఇప్పటికీ తెరిచే ఉండటం, వాటిలో యువతకు శిక్షణ సైతం కొనసాగుతున్న పరిస్థితులను చంద్రబాబు తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఎన్నికల వేళ కావాలనే కుట్రపూరితంగా ఈ కేసులో చంద్రబాబును ఇరికించారని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసులో ఫిర్యాదే ఓ అభూత కల్పన అని పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్ చట్టవిరుద్ధంగా ఉందంటూ చంద్రబాబు తరఫు న్యాయవాదులు హరీశ్ సాల్వే, సిద్ధార్థ్ లూథ్రా హైకోర్టు ధర్మాసనం ముందు తమ వాదనలు వినిపించారు.
షెల్ కంపెనీల ద్వారా నగదు వెళ్లిందని ఏపీ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు. ఆ డబ్బు ఎక్కడికి వెళ్లిందో పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టాల్సి ఉందన్నారు. ఈ దశలో దర్యాప్తు విషయంలో న్యాయస్థానం కలుగజేసుకోరాదని సూచించారు. కార్పొరేషన్ సంబంధించి న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేయాలని కోరారు. అందుకు వారం రోజులు గడువు ఇవ్వాలని కోరారు. వాదనలు ఈరోజు వినిపించాలని బెంచ్ కోరింది. కౌంటర్ వాదనలు వినిపించడంతో ఇరువైపుల వాదనలు పూర్తయ్యాయి. చంద్రబాబు క్వాష్ పిటిషన్పై తీర్పును హైకోర్టు రిజర్వు చేసింది.