Duvvada vs Kollu Ravindra: ఏపీ రాజకీయాలకు శాసన మండలి వేదికైంది. మండలిలో వైసీపీ సభ్యులు అధికంగా ఉండడంతో ప్రభుత్వంపై ముప్పేట దాడి మొదలుపెట్టే ప్రయత్నం చేసింది. లేటెస్ట్గా కూటమి ప్రభుత్వం కొత్తగా తీసుకొన్నిన మద్య పాలసీపై సభలో అధికార-విపక్షాల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది.
శుక్రవారం మండలి సమావేశాలు ప్రారంభం కాగానే ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం పాలసీ గురించి వివరించారు మంత్రి కొల్లు రవీంద్ర. మిగతా రాష్ట్రాలతో ధరలు పోల్చిన తర్వాతే తక్కువ ధరకే మద్యం ఇస్తున్నామన్నారు. దీనిపై వైసీపీకి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు నోరు విప్పారు.
వైసీపీ హయాంలో షాపులను కుదించి, ప్రభుత్వమే అమ్మకాలు సాగించిందన్నారు. ఆ విధానాన్ని మార్చి, మళ్లీ షాపులను పెంచి టెండర్లు ఇచ్చారన్నారు. షాపుల కేటాయింపు లో రౌడీయిజం జరిగిందన్నారు. ఇదేనా నూతన మద్యం విధానమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మధ్యలో మండలి ఛైర్మన్ మోషేన్ రాజు జోక్యం చేసుకున్నారు. పేపర్లో వచ్చిన ఆర్టికల్స్ ఇక్కడ ప్రామాణికం కాదన్నారు. మద్యం పాలసీపై దువ్వాడకు ఇవాళ గుర్తు వచ్చిందా అంటూ మంత్రి కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. వైసీపీ హయాంలో షాపులను పెంచారని, కూటమి ప్రభుత్వం ఏమాత్రం పెంచలేదన్నారు.
ALSO READ: నేడు హస్తినకు సీఎం చంద్రబాబు.. కేంద్రమంత్రులతో భేటీ.. కారణం ఇదే
10 శాతం కల్లుగీత కార్మికులకు ఇవ్వడం తప్పా అంటూ ఎదురుదాడి మొదలుపెట్టారు మంత్రి. ఆనాడు రేట్లు విపరీతంగా పెంచారన్నారు. 20 డిస్టలరీస్కు సంబంధించి 60శాతం వాటా బలవంతంగా తీసుకున్నారని మండిపడ్డారు.
అంతర్జాతీయ బ్రాండ్లను తీసుకురాలేదన్నారు. ఎక్సైజ్ డిపార్టుమెంట్ మొత్తాన్ని వైసీపీ నాశనం చేసిందని గుర్తు చేశారు. ఓన్లీ క్యాష్ రూపంలో నగదు తీసుకున్నారని, ఆ మనీ ఎక్కడని ప్రశ్నించారు మంత్రి. మిగతా రాష్ట్రాలతో పోల్చితే ఏపీలో మద్యం తక్కువగానే ఉంటుందన్నారు. మద్యం పేరిట వైసీపీ దోపిడీకి పాల్పడిందని దుయ్యబట్టారు మంత్రి కొల్లు రవీంద్ర.
ప్రస్తుతం అంతర్జాతీయ బ్రాండ్లను తీసుకొచ్చామన్నారు మంత్రి. లిక్కర్లో జరిగిన అవకతవకలపై విజిలెన్స్ విచారణ జరిగిందన్నారు. సీఐడీ దర్యాప్తు చేస్తోందని, ప్రధాన సూత్రదారులు బయటకు వస్తారన్నారు. అక్రమార్కులపై చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి కొల్లు రవీంద్ర.