ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్ సగం రోజు గడిచే లోపే నలుగురు కేంద్ర మంత్రుల్ని కలిశారు. ఏపీకి సంబంధించిన వరాల చిట్టా వారికి అందించారు. వీలైనంత మేర ఏపీకి నిధులు, ప్రాజెక్ట్ లు తీసుకొచ్చేందుకు ప్రయత్నించినట్టు తెలుస్తోంది. కేంద్ర మంత్రుల నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని టీడీపీ వర్గాలంటున్నాయి. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ తో మొదలు పెట్టి.. ఎరువులు, రసాయనాల శాఖల మంత్రి జేపీ నడ్డా, ఆ తర్వాత పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి, రవాణా మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. లోకేష్ వెంట టీడీపీ లోక్ సభ, రాజ్యసభ ఎంపీలు ఉన్నారు.
డేటా సిటీకోసం..
ఏపీలో డేటా సిటీ ఏర్పాటుకు సహకారం అందించాలని విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ ని కోరారు నారా లోకేష్. ఉద్యోగాల కోసం రాష్ట్రం నుంచి ఇతర దేశాలకు వెళ్లే యువతకు సాఫ్ట్ స్కిల్స్ లో శిక్షణ ఇచ్చేందుకు విశాఖపట్నంలో ఎఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, డేటా సిటీ ఏర్పాటుకు కేంద్ర సహకారం అందించాలని విజ్ఞప్తిచేశారు. విదేశాలకు వలస వెళ్లే కార్మికుల సంక్షేమం, భద్రతకోసం ప్రవాస భారతీయ బీమా యోజన వంటి పథకాలను విస్తరించాలని, ఆయా సమస్యల ఫిర్యాదుల పరిష్కారం కోసం ఏపీలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలన్నారు.
యూరియా సమస్య పరిష్కారం కోసం..
రాష్ట్రంలో యూరియా సమస్యను వెంటనే పరిష్కరించాలని కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కోరారు నారా లోకేష్. ఈనెల 21నాటికి సమస్య పరిష్కరిస్తామన్న నడ్డా హామీ ఇవ్వడం విశేషం. ఏపీకి 29వేల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయిస్తామని చెప్పారాయన. ఏపీలో స్థానిక పరిశ్రమల అభివృద్ధి, యువతకు ఉపాధి కోసం ప్లాస్టిక్ పార్కు ఏర్పాటుకు సహకారం అందించాలని కూడా మంత్రి లోకేష్ కోరారు. విశాఖపట్నంలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసుటికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చి (NIPER) శాశ్వత క్యాంపస్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కూడా అభ్యర్థించారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం 100 ఎకరాల భూమిని సిద్ధం చేసినట్టు తెలిపారు. ఏపీలో కూటమి ప్రభుత్వ హయాంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిని లోకేష్ ఆయనకు వివరించారు.
రిఫైనరీ నిర్మాణంకోసం..
ఏపీలో బీపీసీఎల్ సంస్థ నిర్మించే రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కార్యకలాపాలు త్వరితగతిన ప్రారంభించేందుకు సహకారం అందించాలని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురిని కోరారు మంత్రి లోకేష్. కాంప్లెక్స్ కు సంబంధించి పనుల పురోగతిపై చర్చించారు.ఈ ఏడాది చివరి నాటికి బీపీసీఎల్ రిఫైనరీ ప్రారంభించేందుకు రాష్ట్రప్రభుత్వం తరపున అన్నివిధాల సహాయ, సహకారాలను అందిస్తామన్నారు. ప్రాజెక్టు ని సకాలంలో పూర్తిచేసేందుకు కేంద్రం కూడా సహకరించాలని అభ్యర్థించారు.
రోడ్ల విస్తరణ కోసం..
ఏపీలో రోడ్ల విస్తరణ ప్రాజెక్ట్ లపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలసి వినతిపత్రాలు అందించారు మంత్రి లోకేష్. విజయవాడ బెంజి సర్కిల్ వద్ద ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా కానూరు – మచిలీపట్నం మధ్య ఆరు లైన్ల రోడ్డు విస్తరణకు వెంటనే ఉత్తర్వులు జారీచేయాలని కోరారు. హైదరాబాద్ – అమరావతి మధ్య కనెక్టివిటీలో ఎన్ హెచ్ – 65 ది కీలక పాత్ర అని, హైదరాబాద్ – గొల్లపూడి రహదారి విస్తరణ ప్రాజెక్టును అమరావతితో అనుసంధానించేలా అదనపు పోర్టు లింకేజిని డీపీఆర్ లో చేర్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. విజయవాడ సిటీలో ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు ఈస్ట్ బైపాస్ రోడ్డు నిర్మాణానికి సహకారం అందించాలన్నారు. బెంగుళూరు – చెన్నై రహదారికి డైరక్ట్ కనెక్టవిటీ కోసం కుప్పం-హోసూరు – బెంగుళూరు మధ్య 56 కి.మీ.ల మేర రూ.3వేల కోట్లతో గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి అనుమతులు త్వరితగతిన మంజూరు చేయాలని కూడా కోరారు. కేంద్రప్రభుత్వ సాంకేతిక ప్రమాణాలకు అనుగుణంగా భూసేకరణకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని వివరించారు లోకేష్. నలుగురు కేంద్ర మంత్రులతో వేర్వేరుగా భేటీ అయిన నారా లోకేష్.. ఏపీకి రావాల్సిన అభివృద్ధి ఫలాలను వెంటనే విడుదల చేయోలని కోరడం విశేషం. ఈ భేటీల అనంతరం మంత్రి నారా లోకేష్ టీడీపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయానికి వెళ్లారు. టీడీపీ, జనసేన ఎంపీలు లోకేష్ ని సత్కరించారు.