WhatsApp Block: ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్కు కొత్త సమస్య వచ్చిపడింది. ప్రజలకు అందుబాటులో ఉండాలని, వారి సమస్యలు నేరుగా ఆలకించాలని తన వాట్సాప్లకు సందేశాలను స్వీకరించారు. కానీ, ప్రజల నుంచి సమస్యల రూపంలో మెస్సేజీలు కుప్పలు తెప్పలుగా వచ్చిపడ్డాయి. దీంతో నారా లోకేశ్ వాట్సాప్ను మెటా బ్లాక్ చేసింది. ఈ మేరకు నారా లోకేశ్ ఓ ప్రకటనలో వెల్లడించారు. వేలాది మంది తమ సమస్యలను వాట్సాప్ చేయడం వల్ల సాంకేతిక సమస్యతో తన వాట్సాప్ బ్లాక్ అయినట్టు తెలిపారు.
అలాగని, ప్రజల సమస్యలు తనకు పంపొద్దని చెప్పలేదు. అందుకు ఓ ప్రత్యామ్నాయ మార్గాన్ని సూచించారు. తన వాట్సాప్ బ్లాక్ అయినందున వాట్సాప్ మెస్సేజీ చేస్తే ప్రయోజనం లేదని సూచించిన నారా లోకేశ్.. అందుకు ప్రతిగా మెయిల్ ఐడీకి పంపాలని తెలిపారు. [email protected] అనే మెయిల్ ఐడీని తాను క్రియేట్ చేసినట్టు వివరించారు. పాదయాత్రలో యువతకు తనను చేరువ చేసిన హలో లోకేశ్ కార్యక్రమం పేరుతోనే కొత్త మెయిల్ ఐడీని రూపొందించినట్టు చెప్పారు.
తమ పేరు, ఊరు, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడీ, సమస్య, సహాయానికి సంబంధించిన పూర్తి వివరాలను తన వినతిలో పొందుపరిచి [email protected] మెయిల్ ఐడీకి పంపించాలని మంత్రి నారా లోకేశ్ సూచించారు. తనకు మెయిల్ చేస్తే చాలు సహాయం చేయడానికి, ఆ సమస్య పరిష్కరించడానికి తాను బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు.
ఎన్నికల ప్రచారంలో, పాదయాత్ర చేస్తున్న సమయంలో నారా లోకేశ్ సాధారణ జనంతో కలిసిపోయారు. చాలా మంది తన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. వచ్చేది తమ ప్రభుత్వమేనని భరోసాగా చెప్పారు. ఏ సమస్య ఉన్నా ఈ నెంబర్కు మెస్సేజీ చేయాలని సూచనలు చేశారు. ఆయన అన్నట్టుగానే ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. దీంతో నారా లోకేశ్ నెంబర్ తీసుకున్నవారు.. ఆయనకు సమస్యలను మెస్సేజీ చేయడం మొదలు పెట్టారు. ఈ మెస్సేజీల సంఖ్య భారీగా పెరిగిపోవడంతో వాట్సాప్ మాతృ సంస్థ మెటా యాక్షన్ తీసుకుంది. నారా లోకేశ్ వాట్సాప్ను మెటా బ్లాక్ చేసింది. తమ మెస్సేజీలు నారా లోకేశ్కు డెలివరీ కాకపోవడంపై ప్రజలు ఆందోళన చెందారు. కానీ, తన వాట్సాప్ బ్లాక్ అయిందని నేరుగా నారా లోకేశ్ ప్రకటించడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. అంతేగాక, ప్రత్యామ్నాయ మార్గాన్ని కూడా సూచించడంతో సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు.