SSC : పాపం ఆ స్టూడెంట్. బాగా చదువుతుంది. స్కూల్లో జరిగిన అన్ని పరీక్షల్లో మంచి మార్కులు వచ్చాయి. ఫైనల్ ఎగ్జామ్స్కు బాగా ప్రిపేర్ అయింది. పరీక్షలు సైతం చాలా బాగా రాసింది. టాప్ మార్క్స్ వస్తాయని ధీమాగా ఉంది. తీరా SSC రిజల్ట్స్ చూసే సరికి ఫెయిల్. కుప్పకూలిపోయింది ఆ విద్యార్థిని. తాను ఫెయిల్ కావడం ఏంటని బోరున ఏడ్చింది. అన్ని సబ్జెక్ట్స్లో 90కి పైగా మార్కులు వచ్చాయి. కానీ, సోషల్ స్టడీస్లో మాత్రం జస్ట్ 23 మార్కులే. అదేంటి తాను ఆ ఎగ్జామ్ బానే రాశానే.. ఫెయిల్ కావడం ఏంటని ఆశ్చర్యపోయింది. వెక్కి వెక్కి ఏడ్చింది. ఆమెను ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు.
రివాల్యుయేషన్లో అసలు మార్క్స్
బాపట్ల జిల్లా కొల్లూరు జడ్పీ హైస్కూల్లో పదో తరగతి చదివింది తేజస్విని. పేద కుటుంబం. తండ్రి కూలి పనులు చేస్తుంటాడు. అతనికి చదువు విలువ అంతగా తెలీదు. వేలల్లో ఫీజులు కట్టి ప్రైవేట్ స్కూల్లో చదివించేంత స్తోమత లేదు. అందుకే, స్థానిక ప్రభుత్వ పాఠశాలలోనే తేజస్విని చదివింది. మెరిట్ స్టూడెంట్గా నిలిచింది. అయితే, టెన్త్ సోషల్లో ఫెయిల్ కావడం ఆ విద్యార్థినిని, ఆమె కుటుంబాన్ని తీవ్ర నిరుత్సాహానికి గురి చేసింది. మా తల రాత ఇంతే అనుకున్నారు ఆ పేరెంట్స్. కానీ, తేజస్వినితో పాటు ఆమెకు చదువు చెప్పిన టీచర్స్ మాత్రం విషయాన్ని అక్కడితే వదిలిపెట్టలేదు. తాను ఎగ్జామ్ బాగా రాశానని ఆమె ధీమాగా చెప్పడంతో.. రివాల్యుయేషన్కు అప్లై చేశారు. ఆ ఫలితాలు ఇటీవలే వచ్చాయి. ఏ సోషల్ స్టడీస్ పేపర్లో అయితే 23 మార్కులతో ఫెయిల్ అయిందో.. అదే పేపర్ పునఃమూల్యాంకనంలో సూపర్ డూపర్ మార్క్స్ వచ్చాయి. ఏకంగా 100కు 96 మార్కులతో పాస్ అయింది తేజస్విని. అంతా షాక్.
పేపర్ దిద్దిన టీచర్ను ఏం చేయాలి?
96 మార్కులు రావాల్సిన చోట 23 మార్కులు వేసి దారుణంగా ఫెయిల్ చేశాడు ఆ పేపర్ దిద్దిన టీచర్. వాడిని ఏం చేయాలి? అంత ఉదాసీనంగా ఎలా ఉంటాడు? ఓ విద్యార్థి మార్కులతో అంత నిర్లక్ష్యమా? ఫెయిల్ అయ్యాననే ఆవేదనలో ఆ స్టూడెంట్ ఏదైనా విపరీత నిర్ణయం తీసుకొని ఉంటే ఎవరు బాధ్యులు? అంటూ ఫస్ట్ టైమ్ పేపర్ దిద్దిన టీచర్ను అంతా తిట్టిపోస్తున్నారు. అయితే, పాస్ అయిన ఆనందమూ ఇప్పుడా అమ్మాయికి మిగలలేదు.
ట్రిపుల్ ఐటీ గడువు ముగిసింది.. ఇప్పుడెలా?
ఎస్సెస్సీలో తేజస్వినికి వచ్చిన మొత్తం మార్కులు 575. పూర్ ఫ్యామిలీ కావడంతో ప్రైవేట్ కాలేజీల్లో చదివించే స్థోమత లేదు వాళ్లకి. ట్రిపుల్ ఐటీనే దిక్కు. తనకు వచ్చిన మార్క్స్తో ఈజీగా అందులో సీటు వస్తుంది. కానీ, అప్లై చేసేందుకు గడువు ముగిసింది. మే 20నే లాస్ట్ డేట్. అయితే, అప్పుడు ఆమెకు ఫెయిల్ మెమో రావడంతో దరఖాస్తు చేయలేకపోయింది. ఇప్పుడు రీవాల్యుయేషన్లో పాస్ అయి, ఏకంగా 575 మార్కులు రావడంతో ట్రిపుల్ ఐటీలో అప్లై చేద్దామంటే గడువు లేకుండా పోయింది. తేజస్విని బాధ వర్ణనాతీతం. ఇందులో తన తప్పేమీ లేదు కాబట్టి.. ట్రిపుల్ ఐటీలో దరఖాస్తు చేసుకునేందుకు తనకు స్పెషల్ పర్మిషన్ ఇవ్వాలని అధికారులను కోరుతోంది. మరి, తేజస్విని రిక్వెస్ట్ను పరిగణలోకి తీసుకుంటారా? ఆ పేదింటి అమ్మాయికి ఉన్నత చదువులు చదివే ఛాన్స్ ఇస్తారా? లేదంటే, చేయని తప్పుకు ఆమె భవిష్యత్తును బలి చేస్తారా?