Online Scam: కడప జిల్లా బద్వేల్లో వెలుగుచూసిన ఆన్లైన్ ప్రేమ ఉదంతం ఇప్పుడు స్థానికంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ప్రేమ పేరుతో దగ్గరై, నమ్మించి ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ను నిలువునా ముంచేసిన కిలాడీ జంట ఉదంతం చూస్తుంటే, ఆన్లైన్ మోసాలు ఏ స్థాయికి చేరుకున్నాయో అర్థం చేసుకోవచ్చు.
అసలేం జరిగిందంటే..
బద్వేల్కు చెందిన అశోక్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగికి సోషల్ మీడియా ద్వారా పూజిత రెడ్డి (మానస) అనే యువతి పరిచయమైంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇదే అదునుగా భావించిన పూజిత, తన సహచరుడు రామలింగారెడ్డితో కలిసి అశోక్ను లక్ష్యంగా చేసుకుంది. రకరకాల కారణాలు చెబుతూ.. అవసరాల పేరుతో అతని నుంచి ఏకంగా రూ. 81.67 లక్షలు వసూలు చేశారు. తీరా అసలు విషయం తెలుసుకున్న అశోక్, తాను మోసపోయానని గ్రహించి ఈ ఏడాది ఫిబ్రవరిలో పోలీసులను ఆశ్రయించాడు.
పోలీసుల వేట – అరెస్ట్..
బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన బద్వేల్ పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు పరారీలో ఉన్న రామలింగారెడ్డి, పూజిత రెడ్డిలను చెన్నంపల్లె ఫ్లైఓవర్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిపై కొత్త చట్టం ప్రకారం BNS 319(2), 318(4), 308(6) r/w 3(5) సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.
బెట్టింగ్ వ్యసనం..
పోలీసుల ప్రాథమిక విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. అశోక్ దగ్గర కాజేసిన సొమ్మంతటినీ నిందితులు Play99 Exchange, Sky Exchange, Paytrust వంటి ఆన్లైన్ బెట్టింగ్ యాప్లలో పెట్టి పోగొట్టినట్లు తేలింది. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో యువత ఇలాంటి అక్రమ మార్గాల వైపు మళ్లుతున్నారని పోలీసులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా బద్వేల్ సీఐ రామకృష్ణ మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో అపరిచితులతో పరిచయాలు పెంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ముఖ్యంగా ఆన్లైన్ ప్రేమలు, బెట్టింగ్ యాప్లకు యువత దూరంగా ఉండాలని, లేదంటే జీవితాలు నాశనం చేసుకుంటారని హితవు పలికారు. సంపాదించిన కష్టార్జితాన్ని ఇలాంటి మోసగాళ్ల చేతుల్లో పెట్టి మోసపోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
Also Read: హై అలర్ట్.. ఏపీలో వడగాలుల బీభత్సం.. పిడుగులతో కూడిన వర్షాలు!