![](https://www.bigtvlive.com/wp-content/uploads/2023/05/Pi7_Image_balineni-150x150-1-1.jpg)
Balineni: వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి పంతం నెగ్గించుకున్నారు. తాను కోరుకున్న అధికారిని డీఎస్పీగా రప్పించారు. ఏకంగా పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ పదవికి రాజీనామా చేసి మరీ అధిష్టానం దిగొచ్చేలా చేశారు. అధికారుల బదిలీల్లో అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు ఏ స్థాయిలో ఉంటుందనేందుకు ఒంగోలు డీఎస్పీ బదిలీ వ్యవహారం మచ్చుతునకగా మారింది.
ఇటీవల ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఒంగోలు డీఎస్పీగా అశోక్వర్థన్ బాధ్యతలు చేపట్టగా ఆ వెంటనే ఆయనను దర్శికి బదిలీ చేశారు. అక్కడ డీఎస్పీ నారాయణస్వామిరెడ్డిని ఒంగోలుకు బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.దీంతో ఖద్దర్ ఖాకీ మిలాఖత్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఎప్పటి నుంచో ఇది ఇంటర్నల్గా జరుగుతున్నా.. ఇప్పుడు బహిరంగంగానే బయటపడుతోంది.
ఖాకీ అంటే… ప్రజలకు రక్షణ కల్పించే వారు! సమాజంలో శాంతి భద్రతలు కాపాడాలి. నేరాలు చేసే వారిని కటకటాల వెనక్కి పంపాలి. మరి ఎమ్మెల్యే చేయాల్సిన పనేంటి? తనకు ఓట్లేసి గెలిపించిన నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరించాలి. కాని రాను రాను ఈ తీరు మారుతోంది. ఓ ఎమ్మెల్యే… తాను కోరుకున్న అధికారి కోసం ఏకంగా స్టేట్ పాలిటిక్స్ నే షేక్ చేశారు. ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేసి మరీ… పంతం నెగ్గించుకున్నారంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఎమ్మెల్యేకు ప్రజలు ముఖ్యమా? లేదా తనకు నచ్చిన అధికారికి పోస్టింగ్ ఇప్పించుకోవడం ముఖ్యమా అనే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఖాకీలు, ఎమ్మెల్యేలు వారి చేయాల్సిన పని మర్చిపోయి.. ఇద్దరు ఒక్కటవుతున్నారు. ఇప్పటికే పోలీస్ స్టేషన్కు వెళ్తే.. అధికార పార్టీ ఎమ్మెల్యే చెబితేనే పని అవుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఒకవేళ.. అక్కడ విపక్షాలకు చెందిన ఎమ్మెల్యే ఉంటే.. అధికార పార్టీ ఇంచార్జ్ చెప్పిందే నడుస్తుంది. అసలు ఎమ్మెల్యే కోరుకున్న పోలీస్ అధికారి ఎందుకు ఉండాలి? ఒకవేళ లేకపోతే ఏం జరుగుతుంది? రాజ్యాంగబద్ధంగా పనిచేయాల్సిన ఖాకీలు.. ప్రజా ప్రతినిధుల చేతుల్లో కీలు బొమ్మలుగా మారారా? ఇలాంటి సంస్కృతి ఇలానే కొనసాగితే.. రానురాను పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడు ఈ ప్రశ్నలే చర్చగా మారాయ్. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెప్పిందే వేదంగా పనిచేస్తున్నారు ఖాకీలు.
పోలీసులను ఉపయోగించుకుని.. తమ గొంతులు నొక్కేస్తున్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయ్. చాలా చోట్ల జరిగేది కూడా ఇదే…! ర్యాలీ, ధర్నా కూడా సజావుగా చేసుకోనివ్వరు. అడ్డగోలుగా… ఇసుక దందాలు, మైనింగ్, ఇల్లీగల్ వ్యవహారాలు జరుగుతుంటాయ్. ఇందులో ఎమ్మెల్యే మనుషులు ఉంటే… ఖాకీలు పట్టించుకోరు. చూసి చూడనట్లు వదిలేస్తారనే విమర్శ ఉంది. దోచుకునేవారు విచ్చలవిడిగా దోచేస్తున్నారు. పోలీసులు లా అండ్ ఆర్డర్ వ్యవహారాలను ఎప్పుడో మరిచిపోయారు. వారికి కావాల్సింది.. నేతల అండదండలు. నేతలు చెప్పినమాట వింటే.. ఎక్కడంటే అక్కడ పోస్టింగ్లు.