Bandi Sanjay latest comments(Political news in Telangana): వైసీపీపై కేంద్ర హోం శాఖ మంత్రి బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తిరుపతి పర్యటనలో భాగంగా గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. వైసీపీ హయాంలో టీటీడీని దోచుకున్నారన్నారు. గత పాలకులు స్వామివారి ఆస్తులకు పంగనామాలు పెట్టారని ఎద్దేవా చేశారు. రాజకీయ నిరుద్యోగులకు టీటీడీని పునరావస కేంద్రంగా మార్చేశారని ఆరోపించారు. ఇతర మతస్తులకు టీటీడీని అప్పగించడంతో ఎన్నో అనర్థాలు జరిగాయని చెప్పారు.
తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామివారిని టచ్ చేశారని.. అందుకే వైసీపీ ఘోరంగా ఓడిపోయిందని బండి సంజయ్ అన్నారు. నయవంచకులు పోయారని.. ఇప్పుడు స్వామివారికి సేవ చేసే వారు వచ్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
గత పాలకులు వీరప్పన్ వారసులు అన్నారు. స్వామివారిని అడ్డంపెట్టుకుని వేలకోట్ల రూపాయల ఎర్రచందనం దోచేశారని ఆరోపించారు. ఎర్రచందనం దొంగలను వదిలిపెట్టేది లేదని వెల్లడించారు.
గత ప్రభుత్వ నిర్వాహకంతో ఎర్రచందనం దొంగలు రాజకీయాలను శాసించే స్థితికి వచ్చారన్నారు. ప్రస్తుతం దీనిపై విచారణ చేపడుతున్నామని, లిస్ట్ తెప్పించుకుంటున్నామన్నారు. త్వరలోనే అందరినీ గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
శేషాచలం కొండల్లో ఎర్రచందనం దోపిడీపై నివేదిక కోరతామని బండి సంజయ్ వెల్లడించారు. నివేదిక ఆధారంగా జాతీయ సంపదను దోచుకున్న వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో ఎర్రచందనంపై చంద్రబాబు పోరాటాలు చేశారని చెప్పుకొచ్చారు.
Also Read: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటాం : సీఎం చంద్రబాబు
ఇక భక్తులు ఎదుర్కొన్న సమస్యలు తొలగిపోయాయని, స్వామివారి ఆస్తుల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటామన్నారు. దేశాన్ని విశ్వగురువుగా చేసేందుకు నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని, ఆయన సారథ్యంలో భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతోందని బండి సంజయ్ వెల్లడించారు.