BR Naidu: టీటీడీపై ఏదైనా కామెంట్ సోషల్ మీడియాలో పెట్టే ముందు జాగ్రత్త. ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని.. మీ సోషల్ మీడియా అకౌంట్లో వ్యాఖ్యానం చేయండి. ఇతర వ్యవహారాలపై చేసే కామెంట్లు ఒకెత్తు. టీటీడీపై చేసే కామెంట్ మరొక ఎత్తు. ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే.. వారిపై కఠిన చర్యలు తప్పవు. ఇదీ టీటీడీ బోర్డు చైర్మన్, ఈవో హెచ్చరికలు జారీ చేశారు.
వెంకన్న భక్తులకు సంక్రాంతి శుభాకాంక్షలు అంటూ మొదలు పెట్టిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు.. 8వ తేదీన జరిగిన ఘటన అత్యంత బాధాకరమని అన్నారు. అలాంటి ఘటన జరక్కుండా ఉండాల్సిందని.. కానీ జరిగిపోయిందని చెప్పారు.. ఇక నుంచి అలా.. జరక్కుండా చూసుకుంటామన్న హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకూ తాము ఇచ్చిన చెక్కులు, ఇంకా ఇవ్వాల్సి ఉన్న చెక్కులకు సంబంధించి పూర్తి వివరాలను అందించారు. మూడు బృందాలుగా ఏర్పడి.. విశాఖ తదితర ప్రాంతాల్లో చెక్కుల పంపిణీ చేశామనీ.. పనబాక, జ్యోతుల వంటి బోర్డు సభ్యులతో పాటు, హోం మంత్రి అనిత, ఇతర ఎమ్మెల్యే ఎంపీల ద్వారా 31 చెక్కుల పంపిణీ జరిగిందనీ.. ఇంకా ఇరవై మందికి చెక్కులు ఇవ్వాల్సి ఉందనీ అన్నారు టీటీడీ చైర్మన్.
ఆరు మంది మరణించగా.. మరో ఇద్దరి పరిస్థితి తీవ్ర విషమంగా ఉందనీ. ఆస్పత్రి లోనే ఆరుగురికి చెక్కుల పంపిణీ చేసేశామనీ.. మిగిలిన ప్రాంతాల వారికి ఇవ్వాల్సిన చెక్కుల సంగతి కూడా చూస్తామనీ.. ఇలా అన్ని పనులు సజావుగానే సాగుతాయనీ.. అన్నారు టీటీడీ బోర్డు చైర్మన్.
అయితే ఇక్కడ ఈ సోషల్ మీడియా సమాజం గుర్తించాల్సిన విషయం ఏంటంటే.. సామాజిక మాధ్యమాల్లో టీటీడీపై అసత్య ప్రచారాలు జరుగుతున్నాయనీ. ఈ విషయంలో టీటీడీ అస్సలు ఒప్పుకోదనీ.. ఇష్టమొచ్చిన కామెంట్లు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారాయన. సరిగ్గా ఇదే విషయంలో టీటీడీ ఈవో సైతం స్పందించారు. టీటీడీ బోర్డుకు, ఈవోకు గ్యాప్స్ ఉన్నాయన్న ప్రచారం నడుస్తోందని.. తమ మధ్య జరగని విషయాలు జరిగినట్టుగా.. అనని మాటలు కూడా అన్నట్టుగా కొందరు సోషల్ మీడియా కామెంట్లు చేస్తున్నారనీ.. వీటిని టాలరేట్ చేయబోమని అన్నారు ఈవో శ్యామల రావు. ఇవి భక్త జనాల్లోకి తప్పుడు సంకేతాలను తీసుకెళ్తున్నాయనీ. మా మధ్య పూర్తి సమన్వయం ఉందని అన్నారాయన.
Also Read: HMFW Jobs: రూ.35,000 జీతంతో ఉద్యోగం.. ఎలాంటి ఎగ్జామ్ లేదు.. వీళ్లందరూ అర్హులే..
మీరు మిగిలిన విషయాల్లో ఎలాంటి ప్రచారాలైనా చేసుకోండి కానీ, టీటీడీపై తప్పుడు ప్రచారం చేస్తే మాత్రం ఊరుకునేది లేదన్నది టీటీడీ చైర్మన్, ఈవోల నుంచి వినిపిస్తోన్న హెచ్చరికగా తెలుస్తోంది. తొక్కిసలాట ఘటనకు కారకులెవరో క్షుణ్ణంగా పరిశీలించి గుర్తిస్తామనీ.. వారందరిపై కఠిన చర్యలు తీసుకోవడం ఖాయమనీ. ఇప్పటికే తనకు సీఎం రెండు సార్లు ఫోన్ చేసి ఇక్కడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారనీ. ఈ క్రమంలో తామెంతో నిబద్ధతతో.. పని చేసుకుంటూ వెళ్తామనీ. దురదృష్టవశాత్తూ జరిగిన ఘటనలను ఆసరాగా చేసుకుని ఇక్కడి వ్యవస్థ మొత్తాన్ని మీ ఇష్టమొచ్చిన కథనాలతో సోషల్ మీడియా వార్తలు వండి వార్చుతుంటే టీటీడీ చూస్తూ ఊరుకోదంటూ ఇటు చైర్మన్ అటు ఈవో ఇరువురూ సోషల్ మీడియా ట్రోలర్స్ కి గట్టి వార్నింగ్ పాస్ చేశారు.