Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్ రవాణా రంగంలో ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ.. ఎయిర్పోర్టు నుంచి తొలిసారిగా వాణిజ్య విమాన సర్వీసులు అధికారికంగా ప్రారంభమయ్యాయి.
సోమవారం ఉదయం 7:00 గంటలకు తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఇండిగో విమానం భోగాపురం రన్వేపై విజయవంతంగా ల్యాండ్ అయింది. విమానాశ్రయ చరిత్రలో ఇది మొదటి ల్యాండింగ్ కావడంతో అక్కడి వాతావరణం పండగను తలపించింది. ల్యాండైన వెంటనే ఎయిర్పోర్టు అధికారులు, జీఎంఆర్ సంస్థ ప్రతినిధులు ప్రయాణికులకు ఘనంగా స్వాగతం పలికారు. తెలుగువారి విశిష్ట సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలిచే ఏటికొప్పాక బొమ్మలను ప్రయాణికులకు జ్ఞాపికలుగా అందించి తమ సంతోషాన్ని పంచుకున్నారు.
భోగాపురం ఎయిర్పోర్ట్కు తొలి విమానం వచ్చేసింది!
AP: భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి విమాన సర్వీసులు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ నుంచి వచ్చిన ఇండిగో 6E 6408 తొలి విమానం ఇక్కడ ల్యాండ్ అవ్వగా, అధికారులు ఘనస్వాగతం పలికారు. ఉదయం 7.30 గంటలకు ఈ… pic.twitter.com/ij4knxQJxN
— BigTV APP (@BigtvApp) August 17, 2026
ఈ తొలి విమానం ఉదయం 7:30 గంటలకు తిరిగి హైదరాబాద్కు బయలుదేరి వెళ్లింది. అదే సమయంలో, ఉదయం 7:30 గంటలకు బెంగళూరు నుంచి వచ్చిన మరో ఇండిగో విమానం భోగాపురంలో ల్యాండ్ అయి, ఉదయం 8:00 గంటలకు తిరిగి బెంగళూరుకు పయనమైంది. ఈ ల్యాండింగ్లతో ఉత్తరాంధ్ర ప్రజల సుదీర్ఘ స్వప్నం సాకారమై, ప్రాంతీయ విమాన అనుసంధానత మరింత బలపడింది.
Also Read: చేప పిల్లల పంపిణీకి బకాయిల బ్రేక్.. సస్పెన్స్లో మత్స్యకారుల భవిష్యత్తు!