Bhumana Karunakar Reddy: తిరుపతిలో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి మీడియా సమావేశం నిర్వహించి, రాష్ట్ర ప్రభుత్వంపై, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తీవ్ర స్థాయి ఆరోపణలు చేశారు. టీటీడీకి చెందిన అత్యంత విలువైన భూములను పర్యాటక అభివృద్ధి పేరుతో ప్రైవేట్ సంస్థలకు కట్టబెడుతూ, తిరుమల వెంకటేశ్వర స్వామికి తీరని ద్రోహం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
అలిపిరి పాదాల చెంత, అత్యంత సమీపంలో ఉన్న టీటీడీ భూములను పర్యాటక శాఖ భూములతో మార్పిడి చేయడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం గజం రూ. 49 వేలు, ఎకరా రూ. 26 కోట్లు చొప్పున మొత్తం రూ. 460 కోట్ల విలువ చేసే 20 ఎకరాల టీటీడీ భూమిని ప్రభుత్వం తీసుకుంది. దీనికి బదులుగా, ఎకరా కేవలం రూ. 90 లక్షలు మాత్రమే విలువ చేసే పర్యాటక శాఖ భూమిని (మొత్తం విలువ రూ. 18 కోట్లు) టీటీడీకి అంటగట్టారు. బహిరంగ మార్కెట్లో టీటీడీ భూమి విలువ దాదాపు రూ. 3000 కోట్లు ఉంటుందని, కోహినూర్ వజ్రం కంటే విలువైన స్వామివారి ఆస్తిని ఇలా ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెట్టడం “వెంకటేశ్వర స్వామికి మూడు నామాలు పెట్టడమే” అని భూమన విమర్శించారు.
ఈ వ్యవహారంలో అనేక విధానపరమైన అవకతవకలు జరిగాయని భూమన ఎత్తిచూపారు. డిసెంబర్ 11న క్యాబినెట్ నిర్ణయం తీసుకుని, 13న జీవో జారీ చేశారని చెబుతున్నా, ఆ జీవో ఇంకా ఆన్లైన్లో అందుబాటులో లేదన్నారు. కానీ, డిసెంబర్ 5వ తేదీనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరిగిపోయిందని ఆరోపించారు. ఒబెరాయ్ సంస్థకు లీజు డీడ్ మనీ, రూ. 26 కోట్ల స్టాంప్ డ్యూటీ మాఫీ చేయడం, రూ. 2 కోట్ల బిల్డింగ్ ఫీజు సర్దుబాటు చేయడం వెనుక భారీ అవినీతి జరిగిందని ప్రశ్నించారు. కేవలం 100 గదుల హోటల్ (ముంతాజ్ హోటల్ను ‘స్వర’గా మార్చారు) ద్వారా 1500 మందికి ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం చెప్పడం ప్రజలను పక్కదారి పట్టించడమేనని ఆయన అన్నారు.
పర్యావరణ పరంగా కూడా ఈ నిర్ణయం అత్యంత ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. కేటాయించిన భూమి ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలో ఉందని, అక్కడ విలువైన ఎర్రచందనం వనాలు ఉన్నాయని తెలిపారు. అనుమతులు లేకుండానే అక్కడ పనులు జరుగుతున్నాయని, ఎర్రచందనం దుంగలు ఏమయ్యాయో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఏడు కొండల పరిధిగా నిర్ణయించిన ప్రాంతంలో ఈ భూములు ఉన్నాయని గుర్తు చేశారు. ప్రైవేట్ హోటల్ కోసం దేవుడి ఆస్తిని ధారాదత్తం చేయడం పరకామణి దొంగతనం కంటే పెద్ద దోపిడీ అని అభివర్ణించారు.
ఈ మొత్తం వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తక్షణమే స్పందించాలని, జిల్లా కలెక్టర్ నైతిక బాధ్యత వహించాలని భూమన డిమాండ్ చేశారు. అలాగే పీఠాధిపతులు, స్వామీజీలు మౌనం వీడి దేవుడి ఆస్తుల రక్షణ కోసం పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
Read Also: CM Chandrababu: గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు.. సీఎం కీలక నిర్ణయం