YS Jagan: మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో ఆయనకు ఊరట లభించలేదు. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ ఆయన దాఖలు చేసిన అభ్యర్థనను సీబీఐ కోర్టు తిరస్కరించింది. మినహాయింపు ఇవ్వరాదంటూ సీబీఐ గట్టిగా అభ్యంతరం వ్యక్తం చేయడంతో.. చివరికి జగన్ తరపు న్యాయవాది తమ అభ్యర్థనను వెనక్కి తీసుకున్నారు. దీంతో ఈ నెల 21వ తేదీలోగా ఆయన వ్యక్తిగతంగా కోర్టు విచారణకు హాజరు కావాల్సిందేనని సీబీఐ కోర్టు స్పష్టం చేసింది.
గతంలో యూరప్ పర్యటనకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చినప్పుడు తిరిగి వచ్చిన తర్వాత నవంబర్ 14 లోపు కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాలని న్యాయస్థానం షరతు విధించింది. అయితే.. పర్యటన నుంచి తిరిగి వచ్చిన జగన్, తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ సీబీఐ కోర్టులో మెమో దాఖలు చేశారు. ఈ అభ్యర్థనపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ కౌంటర్ దాఖలు చేసింది. జగన్ తన వ్యక్తిగత హాజరును తప్పించుకోవడానికి గత కొన్నేళ్లుగా ఏదో ఒక కారణం చెబుతూ కోర్టు విచారణకు రాకుండా తప్పించుకుంటున్నారని సీబీఐ కౌంటర్లో స్పష్టం చేసింది. ఈ కేసులో విచారణను ముందుకు తీసుకు వెళ్లడానికి వ్యక్తిగత హాజరు తప్పనిసరి అని సీబీఐ బలంగా వాదించింది.
సీబీఐ దాఖలు చేసిన కౌంటర్, వ్యక్తం చేసిన తీవ్ర అభ్యంతరం నేపథ్యంలో.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తరపు న్యాయవాది కీలక నిర్ణయం తీసుకున్నారు. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని వేసిన తన మెమోను వెనక్కి తీసుకుంటున్నట్లు కోర్టుకు తెలియజేశారు. అయితే.. వెంటనే కాకుండా వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యేందుకు కొంత సమయం ఇవ్వాలని జగన్ తరపు న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. ఈ నెల 14వ తేదీలోగా హాజరు కావాలన్న గడువు సమీపిస్తుండటంతో, వారం రోజుల సమయం ఇవ్వాలని కోరారు. ఆ గడువులోపు జగన్ తప్పకుండా వ్యక్తిగతంగా కోర్టుకు హాజరవుతారని ఆయన తరపు న్యాయవాది న్యాయస్థానానికి తెలిపారు.
జగన్ తరపు న్యాయవాది అభ్యర్థనను పరిశీలించిన సీబీఐ కోర్టు వ్యక్తిగత హాజరుకు మరో వారం రోజుల గడువును ఇచ్చింది. ఈ నెల నవంబర్ 21వ తేదీ లోపు జగన్ వ్యక్తిగతంగా కోర్టు విచారణకు హాజరు కావాల్సిందేనని సీబీఐ కోర్టు స్పష్టం చేస్తూ తదుపరి ఉత్తర్వులు జారీ చేసింది. సుదీర్ఘ కాలంగా సాగుతున్న అక్రమాస్తుల కేసులో ట్రయల్ కోర్టు విచారణను వేగవంతం చేయాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో.. సీబీఐ కోర్టు ఈ కేసు విచారణను అత్యంత కీలకంగా పరిగణిస్తోంది. నవంబర్ 21న జగన్ వ్యక్తిగత హాజరుతో ఈ కేసు విచారణలో ఎలాంటి పురోగతి ఉంటుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ALSO READ: Telangana Govt: మొంథా తుఫాన్ బాధితులకు గుడ్ న్యూస్.. పరిహారం విడుదల చేసిన రేవంత్ సర్కార్