TDP vs YCP: వైసీపీకి టీడీపీ స్పెషల్ థ్యాంక్స్ చెప్పింది. అదేంటీ టీడీపీకి వైసీపీకి అసలు పొంతన కుదరదు. ఇదేంటిది.. స్పెషల్ థ్యాంక్స్ చెప్పడం ఏమిటో అనుకుంటున్నారా? దాని వెనుక పెద్ద కారణమే ఉంది. ఇంతకు ఆ థ్యాంక్స్ వెనుక అసలు మర్మం తెలుసుకుంటే, ఔరా అనాల్సిందే.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపే టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్య మాటల యుద్దం సాగుతోంది. ఇక కూటమి అధికారంలోకి వచ్చిన వేళ నుండి వైసీపీ విమర్శల పర్వానికి మరింత పదును పెట్టింది. కానీ అదే రీతిలో వైసీపీకి టీడీపీ కౌంటర్ వేస్తూ వస్తోంది. అయితే సోమవారం టీడీపీ సోషల్ మీడియా ఓ కథనాన్ని వైరల్ చేసింది. ఆ కథనంలో అసలు నిజాన్ని ప్రజలకు తెలిసేలా చేసిన వైసీపీకి థ్యాంక్స్ తరహాలో టీడీపీ తన అభిప్రాయం తెలిపింది. ఏపీ రాజధాని అమరావతిని అభివృద్ది చేసేందుకు సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నారు. రాజధాని లేని రాష్ట్రంగా ఇంకెన్నాళ్లు అంటూ ప్రశ్నలు రాకమునుపే, కూటమి అధికారంలోకి రాగానే రాజధాని నిర్మాణానికి ప్రత్యేక నిధులు కేటాయించింది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సైతం ఏపీ రాజధాని నిర్మాణం కోసం అన్ని విధాలా సహకరిస్తోంది.
ఇటీవల ఏపీ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెల్సిందే. ఆ బడ్జెట్ లో అన్ని వర్గాల ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టిందని చెప్పవచ్చు. ఇచ్చిన హామీలకు కట్టుబడి వాటిని అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించింది. అలాగే పలు అభివృద్ది పనులకు సైతం నిధులు వెచ్చించనున్నట్లు బడ్జెట్ లో పేర్కొంది. అమరావతి రాజధాని నిర్మాణం కోసం బడ్జెట్ లో నిధులు కేటాయించలేదు. దీనితో అప్పులు తెచ్చి రాజధాని కడుతున్నారని వైసీపీ విమర్శలు ప్రారంభించింది.
రాజధాని నిర్మాణం అంటూ ప్రజలను కూటమి ఏమారుస్తుందని, ఒక్క రూపాయి నిధులు కేటాయించకుండా, అంతా అప్పులు తెచ్చి నిర్మాణం సాగిస్తుందని వైసీపీ విస్తృత ప్రచారం సాగించింది. ఇప్పటికే ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోగా, రాజధాని పేరిట మరింతగా ఏపీపై మరింత అప్పుల భారం మోపనున్నట్లు వైసీపీ విమర్శల పర్వం అర్థం. అయితే ఇక్కడే వైసీపీ ఓ విషయాన్ని మరచిపోయిందని టీడీపీ అంటోంది. అదే విషయాన్ని వైసీపీకి చెందిన ఎంపీ గురుమూర్తి బయట పెట్టారని టీడీపీ అంటోంది.
Also Read: Free Bus Service In AP: ఆ బస్సులలో నో టికెట్.. ఈ ఛాన్స్ మిస్ కావద్దు
రాజధాని నిర్మాణ అప్పుల గురించి పార్లమెంట్ లో వైసీపీ ఎంపీ గురుమూర్తి ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు కేంద్రం సమాధానమిచ్చింది. రాజధాని కోసం ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ఇచ్చే రుణాలు ఏపీ అప్పుల పరిమితిలోకి రావని స్పష్టం చేసింది. కేంద్రం ఇచ్చిన సమాధానాన్ని బట్టి, రాజధాని కోసం చేసే అప్పులు ఏపీ అప్పుల పరిధిలోకి రావని, దీనితో ప్రజలపై భారం పడే అవకాశం లేదని క్లారిటీ ఇచ్చినట్లయింది. ఈ విషయంపైనే వైసీపీకి టీడీపీ థ్యాంక్స్ చెబుతోంది. వైసీపీ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇవ్వడంతో తమ ఎంపీ ద్వారానే, తాము చేస్తున్నది ఫేక్ ప్రచారం అని, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వైసీపీ తెలియజేసినందుకు థ్యాంక్స్ అంటూ టీడీపీ అంటోంది.