Polavaram-Banakacharla project: కూటమి ప్రభుత్వానికి ఊహించని షాకిచ్చింది కేంద్రం. ఏపీ ప్రతిపాదనను కేంద్ర పర్యావరణ-అడవులు- వాతావరణ శాఖ వెనక్కి పంపింది. ఎన్విరాన్మెంట్ అసెస్మెంట్ కమిటీ చేసిన నివేదికలు, సిఫార్సుల ఆధారంగా తిరస్కరిస్తున్నట్లుగా ఆ శాఖ ఏపీ ప్రభుత్వానికి తెలిపింది. దీంతో ఈ ప్రాజెక్టు కాస్త వెనక్కి వెళ్లింది. ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు. ప్రాజెక్టుకు సంబంధించిన పర్యావరణ అనుమతుల విషయంలో కేంద్ర పర్యావరణ, అడవులు శాఖ తోసి పుచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ లిఖిత పూర్వకంగా ఏపీ ప్రభుత్వానికి తెలిపారు. పర్యావరణ శాఖలోని ఎన్విరాన్మెంట్ అసెస్మెంట్ కమిటీ నివేదికల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
1980 గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ తీర్పుకు ఈ ప్రాజెక్టు రూపకల్పన-నీటి వినియోగ ప్రతిపాదనలు విరుద్ధంగా ఉన్నాయనే అభ్యంతరాలు వచ్చాయని, ఆయన తెలియజేశారు. దీనికితోడు తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ప్రయోజనాలపై ప్రభావం పడే అవకాశం ఉందనే అంశాన్ని ఎన్విరాన్మెంట్ అసెస్మెంట్ కమిటీ పరిగణనలోకి తీసుకుందని పేర్కొన్నారు.
ప్రాజెక్టుకు ముందు కేంద్ర జల సంఘం-సీడబ్ల్యూసీ ద్వారా వరద జలాల లభ్యతపై సమగ్ర అధ్యయనం చేయించాలని కేంద్రం సూచన చేసింది. అంతర్రాష్ట్ర వివాదాలు పరిష్కరించిన తర్వాత పర్యావరణ అనుమతుల కోసం మళ్లీ దరఖాస్తు చేయాలని అందులో ప్రస్తావించింది. దాదాపు రూ.81,900 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టు చేపట్టాలని చంద్రబాబు సర్కార్ భావించింది.
ALSO READ: వైద్యురాలి తలపైకి కారు ఎక్కించి.. రాజమండ్రిలో దారుణం, మాల్లో యువకులు అఘాయిత్యం
ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి నుంచి 200 టీఎంసీల వరద జలాలను రాయలసీమకు తరలించాలని లక్ష్యంగా పెట్టుకుంది. సుమారు 80 లక్షల మందికి తాగునీరు, 3 లక్షల హెక్టార్లకు సాగునీరు అందుతుందని ప్రభుత్వ అంచనా. కేంద్రం తొలి దశలో ఏపీ ప్రతిపాదనను వెనక్కి పంపింది. దీంతో ప్రాజెక్టు తాత్కాలికంగా నిలిచిపోయినట్టు కనిపిస్తోంది.