Chandrababu vs YS Jagan: ఏపీలో పీఏసీ ఎన్నికపై ఎన్డీఏ పక్షాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. పీఏసీ ఎన్నికలో సంఖ్యాబలం ప్రకారం వెళ్లాలని ఎన్డీఏ పక్షాలు నిర్ణయించాయి. పీఏసీ సభ్యత్వానికి ఎన్డీఏ తరపున తొమ్మిది మంది ఎమ్మెల్యేలు నామినేషన్ దాఖలు చేశారు. అలాగే వైసీపీ తరపున పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి నామినేషన్ వేశారు. తొమ్మిది నామినేషన్లు మాత్రమే దాఖలైతే పీఏసీ ఎన్నిక ప్రక్రియ ఏకగ్రీవం అవుతుంది. పీఏసీలో ఉండాల్సిన సభ్యులకంటే ఒక నామినేషన్ ఎక్కువ దాఖలు కావటంతో పీఏసీ ఛైర్మన్ ఎన్నిక రసవత్తరంగా మారింది. అయితే ఇప్పటికే అసెంబ్లీని బాయ్కాట్ చేస్తున్నట్లు ప్రకటించిన వైసీపీ .. తాజాగా పీఏసీ ఎన్నికలను కూడా బహిష్కరించడంతో పీఏసీ బరి నుంచి ఆ పార్టీ నిష్క్రమించినట్లైంది.
పీఏసీ ఛైర్మన్ ఎంపికలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రతిపక్షానికి దక్కే పీఏసీ ఛైర్మన్ పదవి ఈ సారి కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేనకు దక్కింది వైసీపీకి సభ లో సంఖ్యా బలం లేకపోవటంతో జనసేనకు ఈ పదవి ఇవ్వాలని నిర్ణయించారు. అందులో భాగంగా జనసేన నుంచి భీమవరం ఎమ్మెల్యే పులపర్తి ఆంజనేయులు పేరు పవన్ సూచించారు. పీఏసీ సభ్యత్వానికి కనీసం 18 మంది ఎమ్మెల్యేల బలం ఉండాలి.
వైసీపీకి 11 మందే ఉన్నా మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో నామినేషన్ దాఖలు చేయించింది. పీఏసీకి నామినేషన్లు దాఖలు చేయవచ్చని బుధవారం శాసనసభలో ప్రకటించారు. శాసనసభ నుంచి 9 మంది, మండలి నుంచి ముగ్గురికి సభ్యులుగా అవకాశం ఉంటుంది. సాధారణంగా ప్రతిపక్ష పార్టీకి ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్ పదవి దక్కుతుంది. ప్రస్తుతం శాసనసభలో ప్రతిపక్ష హోదా దక్కేందుకు అవసరమైన 10 శాతం సభ్యుల బలం వైసీపీకి లేకపోవడంతో ఆ హోదా దక్కలేదు. ఈ నేపథ్యంలోనే పీఏసీ ఛైర్మన్ ఎంపిక వ్యవహారం ఆసక్తికరమైన మలుపు తిరిగింది.
పీఏసీ చైర్మన్ పదవి వాస్తవంగా ప్రతిపక్షానికి ఇవ్వటం ఆనవాయితీ. అయితే, ప్రతిపక్ష హోదా వైసీపీకి దక్కలేదు. సభలో కనీసం 18 మంది ఉంటేనే ఈ హోదా దక్కనుంది. అదే విధంగా పీఏసీ సభ్యుల ఎన్నిక కోసం ఈ రోజు నామినేషన్లు స్వీకరించారు. వైసీపీ నుంచి అసెంబ్లీ కోటాలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి, మండలి నుంచి మరో ముగ్గురు నామినేషన్లు దాఖలు చేసారు. ఒక దశలో ఆనవాయితీ ప్రకారం వైసీపీ ప్రతిపక్ష పార్టీ హోదా లేకపోయినా.. ఆ పార్టీకే పీఏసీ ఇస్తారనే వాదన వినిపించింది.
Also Read: ఇబ్బందులు పెట్టినోళ్లకి పోస్టింగ్లా.. తెలుగు తమ్ముళ్లు వార్నింగ్
అయితే వైసీపీ నుంచి మాజీ మంత్రి పెద్దిరెడ్డి పేరు పీఏసీ చైర్మన్గా ఫోకస్ అవ్వడంతో సీన్ మారిపోయింది. గత అయిదేళ్లలో పెద్దిరెడ్డి అవినీతి, భూ కబ్జాలపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం వాటిపై విచారణలు జరుగుతున్నాయి. మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసు కేసులో ఫైల్స్ దగ్ధం కేసు పెద్దిరెడ్డికి చుట్టుకుంటుంది. అదీ కాక ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి అధికారదర్పంతో అప్పట్లో చంద్రబాబుపైనే దాడులు చేయించారన్న ఆరోపణలున్నాయి. కుప్పంలో చంద్రబాబును ఓడించి ఆయన రాజకీయ జీవితాన్ని భూస్థాపితం చేస్తామని పెద్దిరెడ్డి ప్రగల్భాలు పలికారు.
దాంతో పెద్దిరెడ్డి కూటమి పార్టీలకు టార్గెట్ అవుతున్నారు. ముఖ్యంగా తెలుగు తమ్ముళ్లు ఆయనపై ఆగ్రహంలో రగిలిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో క్యాబినెట్ హోదా ఉన్న పీఏసీ చైర్మన్ పదవి రేసులోకి పెద్దిరెడ్డి రావడం కూటమి వర్గాలకు రుచించలేదంటున్నారు. అందుకే అనూహ్యంగా చివరి నిమిషంలో కొత్త ట్విస్ట్ ఇచ్చి జనసేన అభ్యర్ధిని రంగంలోకి దించారంట. దాంతో శాసనసభ నుంచి వైసీపీ అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేసిన పెద్దిరెడ్డికి స్థానం దక్కకుండా పోయింది.
శాసన మండలిలో వైసీపీకి బలం ఉండటంతో అక్కడ నుంచి ఇద్దరికి పీఏసీ కమిటీలో స్థానం దక్కింది. అయితే, పీఏసీ ఛైర్మన్ అయ్యే వ్యక్తి ఎమ్మెల్యే అయి ఉండాలి అనే నిబంధనతో వైసీపీకీ పీఏసీ ఛైర్మన్ పదవి దూరమైంది. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులు టీడీపీ తీసుకోవటంతో…పీఏసీ ఛైర్మన్ పదవి జనసేనకు ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. ఈ పదవికి తొలుత మాజీ మంత్రి కొణతాల పేరు తెర మీదకు వచ్చింది. అయితే, స్పీకర్ అదే జిల్లా వారు కావటంతో.. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పేరు పవన్ సూచించారు. దీంతో, పీఏసీ ఛైర్మన్ గా రామాంజనేయులు ఎంపిక లాంఛనం పూర్తైంది.
వైసీపీ మాత్రం పీఏసీ పదవిపై రచ్చ కొనసాగిస్తూనే ఉంది. ప్రతిపక్షాలకు పీఏసీ ఇస్తారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అంటున్నారు. కూటమి ప్రభుత్వం సంప్రదాయాలను మంటగలుపుతోందని విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ క్రమంలో పీఏసీ ఎన్నికలను బహిష్కరించిన వైసీపీ ముందే చేతులెత్తేసినట్లైంది. ఇక ప్రతిపక్షహోదా ఇచ్చే వరకు అసెంబ్లీకి రామని జగన్ బీష్మించుకుని కూర్చొన్నారు. మరి అసెంబ్లీ అసెంబ్లీకి రామన్నవారికి పీఏసీ పదవి ఇస్తే ఆ పదవికి న్యాయం జరుగదన్న అభిప్రాయంతోనే కూటమి సర్కారు కీలక నిర్ణయం తీసుకుందని అంటున్నారు.