Chandrababu Mahanadu Speech(Latest news in Andhra Pradesh): తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మహానాడు వేదికపై నుంచి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎన్నికల సమర శంఖాన్ని పూరించారు. రాష్ట్రాన్ని కాపాడుకుందాం అని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎవరూ మనల్ని అడ్డుకోలేరని స్పష్టం చేశారు. అడ్డుకుంటే తొక్కుకుంటూ ముందుకెళతామని వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రస్తుతం ఏపీలో దుర్మార్గపు పాలన సాగుతోందని చంద్రబాబు మండిపడ్డారు.
టీడీపీని దెబ్బతీద్దామని చాలామంది ప్రయత్నించారని చంద్రబాబు ఆరోపించారు. కానీ వారి ప్రయత్నాలు సఫలం కాలేదన్నారు. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ టీడీపీ అని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగులకు నెలవారీ జీతాలు ఇచ్చే పరిస్థితుల్లో కూడా లేదని విమర్శించారు. వారికి పీఆర్సీ కూడా ఇవ్వలేదన్నారు. జాబ్ క్యాలెండర్ ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందని మండిపడ్డారు.
టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ సేవలను చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. తెలుగుజాతి ఆత్మగౌరవం కాపాడానికే 60 ఏళ్ల వయస్సులో ఎన్టీఆర్ రాజకీయాల్లో వచ్చారని స్పష్టం చేశారు. పార్టీ పెట్టి అతి తక్కువ సమయంలోనే అధికారంలోకి వచ్చారని తెలిపారు. ఎన్టీఆర్ ను యుగపురుషుడిగా పేర్కొన్నారు. ఆ మహనీయుడి పేరు చెబితే సంక్షేమ పథకాలే గుర్తొస్తాయన్నారు. మహిళలకు ఆస్తి హక్కు కల్పించారని తెలిపారు.