AP Politics: మాజీ ముఖ్యమంత్రి జగన్ సతీమణి వైఎస్ భారతీరెడ్డిపై అనుచిత వాఖ్యల కేసులో ఐ టీడీపీ మాజీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. అయితే అతని అరెస్టు సందర్భంలో పోలీసులు తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ప్రస్తుతం వివరణలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయంట. ఒక చిన్న కేసులో వారు ప్రవర్తించిన తీరు, చేసిన ఓవర్ యాక్షన్ వారి మెడకు చుట్టుకునట్లు అయిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అసలు ఈ కేసులు పోలీసులు చేతులు కట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది?
మాధవ్ రచ్చపై ఫోకస్
భారతిపై అనుచిత వ్యాఖ్యల కేసులో చేబ్రోలు కిరణ్ అరెస్ట్
ఓ యూట్యూబ్ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూతో ప్రస్తుతం కటకటాల పాలయ్యాడు గుంటూరుకు చెందిన ఐ టీడీపీ మాజీ కార్యకర్త చేబ్రోలు కిరణ్.. సదరు ఇంటర్య్యూలో మాజీ ముఖ్యమంత్రి జగన్, భారతి దంపతులుపై చేబ్రోలు కిరణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు వైరల్గా మారాయి. జగన్ సతీమణి భారతీరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐ టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ను పోలీసులు ఆగమేఘాలపై అరెస్టు చేశారు.
టీడీపీ నుంచి కిరణ్ను సస్పెండ్ చేసిన అధిష్టానం
కిరణ్ను పోలీసులు మంగళగిరి కోర్టులో హాజరుపర్చడంతో రిమాండ్ కూడా విధించింది. ఇప్పటికే టీడీపీ ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేశారు. టీడీపీ అధిష్టానం ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. భారతిపై చేసిన వ్యాఖ్యలకు చేబ్రోలు కిరణ్ సారీ చెప్పినా ఫలితం లేకుండా పోయింది.
కిరణ్ వ్యాఖ్యాలపై టీడీపీ శ్రేణుల్లోనే వ్యతిరేకత
మరి చేబ్రోలు కిరణ్ ఇదంతా తాను రాజకీయంగా ఎదగటానికి చేశాడో లేకపోతే ఎవరైనా ప్రభావితం చేశారో కాని యూ ట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో అతను చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం శ్రేణుల నుంచే వ్యతిరేకత వ్యక్తమైంది. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు, మరీ ముఖ్యంగా మహిళలను అవమానపరిచేలా వ్యాఖ్యలు చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని కూటమి ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు. దానికి తగ్గట్లుగానే సొంత పార్టీ కార్యకర్తపై చర్యలకు ఉపక్రమించారు .
గుంటూరులో మీడియా ముందు హాజరుపర్చిన పోలీసులు
చేబ్రోలు కిరణ్ కి సంబంధించి ఇటు వైసిపి శ్రేణులే కాదు అటు టిడిపి శ్రేణులు సైతం అనేక ప్రాంతాల్లో ఫిర్యాదులు చేశారు. దీంతో పోలీసులు మంగళగిరిలో వచ్చిన ఫిర్యాదు ఆధారంగా విజయవాడ పరిసర ప్రాంతాల్లోని ఇబ్రహీంపట్నంలో ఉన్నాడనే సమాచారంతో అక్కడికి చేరుకొని చేబ్రోలు కిరణ్ను అదుపులోకి తీసుకున్నారు.. ఆ తర్వాత మంగళగిరి పోలీస్ స్టేషన్ కి తీసుకొని వచ్చి వివరాలు సేకరించి వైద్య పరీక్షల అనంతరం మంగళగిరి కోర్టుకు ప్రవేశపెట్టే ముందు చేబ్రోలు కిరణ్ని గుంటూరు తీసుకొని వచ్చి మీడియా ముందు హాజరు పరిచి తర్వాత మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు
గుంటూరులో పోలీసు వాహనాల్ని అడ్డుకున్న గోరంట్ల మాధవ్
మంగళగిరిలో అరెస్టు చూపించిన చేబ్రోలు కిరణ్ని.. మంగళగిరి కోర్టులో హాజరు పరిచడానికి ముందు గుంటూరు తీసుకొని వస్తున్న సమయంలో వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పోలీసు వాహనాల్ని అడ్డగించడం, చేబ్రోలు కిరణ్పై దాడికి ప్రయత్నించడంతో పోలీసులు గోరంట్ల మాధవ్ని సైతం అదుపులోకి తీసుకున్నారు .. ఆ సందర్భంగా అటు గుంటూరు రోడ్లపై పోలీసు వాహనాలను అడ్డుకోవడం, గుంటూరు ఎస్పీ ఆఫీసులో గోరంట్ల మాధవ్ చేసిన హడావుడి తీవ్ర కలకలం రేపింది..
గుంటూరు ఎందుకు తీసుకెళ్లారని వివరణ కోరిన న్యాయస్థానం
ఆ క్రమంలో చేబ్రోలు కిరణ్ని గుంటూరు తీసుకు రావటంపై కోర్టు పోలీసులు వివరణ కోరుతూ ఉత్తర్వులు ఇచ్చింది.. అసలు మంగళగిరి నుంచి గుంటూరు ఎందుకు తీసుకెళ్లారని, తీసుకు వెళ్లాల్సినంత అవసరం ఏం వచ్చిందని న్యాయస్థానం ప్రశ్నిస్తోంది.. నిందితుడ్ని మీడియా ముందు పెట్టాలి అనుకుంటే మంగళగిరిలోనే పెట్టొచ్చు కదా? గుంటూరు తీసుకొని వెళ్లడం వెనక ఎలాంటి అవసరం ఉందనేది లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్కి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దాంతో పోలీసులు చేతులుకట్టుకుని వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది..
దాడి సమాచారం ఇంటలిజెన్స్ వర్గాలకు అందలేదా?
భారతిపై చేసిన వ్యాఖ్యలతో చేబ్రోలు కిరణ్పై దాడి చేసే అవకాశాలున్నాయన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరిగింది. మరి ఆ దాడి సమాచారం ఇంటెలిజెన్స్ వర్గాలకి ముందుగా అందలేదా? లేకపోతే ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా కావాలనే మంగళగిరి నుంచి గుంటూరుకి చేబ్రోలు కిరణ్ తీసుకొచ్చారా? అన్న చర్చ పోలీసు వర్గాల్లోనూ జరుగుతోంది ..
Also Read: 5 నెలల్లో 7 లక్షలు.. అంబటి తెలివికి షాక్లో వైసీపీ
వైసీపీ అనుకూల అధికారుల ప్రమేయం ఉందా?
డిపార్ట్మెంట్లో ఇప్పటికీ వైసీపీకి అనుకూలంగా వ్యవవహరిస్తున్న అధికారుల ప్రమేయం దీని వెనుక ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కిరణ్ అరెస్టు సమయంలో బయటకు వచ్చిన ఫొటోలపై కూడా ప్రస్తుతం గుంటూరు జిల్లా ఎస్పీ సైతం ఆరా తీస్తున్నారంట.. ఉద్దేశపూర్వకంగా తమను ఇరికించే ప్రయత్నం ఏదైనా జరిగిందా అనే కోణంలో పోలీసులు సమాచారం సేకరించే పనిలో పడ్డారంట.
అరెస్టు చేసిన వెంటనే ఫోటోలు బయటికి ఎలా వచ్చాయి?
చేబ్రోలు కిరణ్ను అరెస్టు చేయగానే వెంటనే ఫొటోలు బయటికి ఎలా వచ్చాయి? అసలు ఎవరు తీశారు? తీయాల్సిన అవసరం ఏం వచ్చింది? దానిని ఎందుకు సోషల్ మీడియాలో హల్చల్ అయ్యేలా ఎందుకు చేశారు? అన్న అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారంట. అలాగే కిరణ్ను మంగళగిరి నుంచి గుంటూరు తీసుకొస్తున్న సమయంలో దాడికి ప్రయత్నించిన గోరంట్ల మాధవ్కు డిపార్ట్మెంట్ నుంచి ఎవరైనా సమాచారాన్ని లీక్ చేశారా? వంటి వాటిపై ప్రస్తుతం గుంటూరు పోలీస్ ఉన్నతాధికారులు ఫోకస్ చేస్తున్నారంట.
గోరంట్ల వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న డిపార్ట్మెంట్
మొత్తమ్మీద మంగళగిరి పోలీస్ స్టేషన్ ఇరుగ్గా ఉండటంతో.. గుంటూరు జిల్లా ఎస్పీ ఆఫీసులో అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదని… అందుకే అక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయాల్సి వచ్చిందని కోర్టుకి వివరణ ఇవ్వటానికి పోలీసులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.. ఏదేమైనా ఇంటర్నల్గా తమకి ఈ అంశం ఇబ్బందిగా మారడంతో డిపార్ట్మెంట్ గోరంట్ల మాధవ్ వ్యవహారంపై సీరియస్గా దృష్టి పెడుతోందంట..