CM Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంధన భద్రతను పటిష్టం చేయడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. గల్ఫ్ దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం, అంతర్జాతీయంగా చమురు ధరల్లో అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో రాష్ట్రంలో వంట గ్యాస్ సరఫరాకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో గ్యాస్ సరఫరా పరిస్థితిపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
రాష్ట్రంలో సాంప్రదాయ ఎల్పీజీ (LPG) సిలిండర్ల వినియోగం కంటే పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) వినియోగాన్ని పెంచడమే ఉత్తమ మార్గమని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఇది సురక్షితమైనది మాత్రమే కాకుండా, అంతర్జాతీయ సరఫరా గొలుసులో వచ్చే అంతరాయాలను అధిగమించడానికి తోడ్పడుతుందని పేర్కొన్నారు. రాబోయే ఆరు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల పీఎన్జీ కనెక్షన్లు ఇవ్వాలని అధికారులకు స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇంధన భద్రతలో ఆంధ్రప్రదేశ్ను ఆదర్శంగా నిలపాలని ఆయన ఆకాంక్షించారు.
రాష్ట్రంలో అమలవుతున్న ‘దీపం’ పథకం లబ్ధిదారులకు ముఖ్యమంత్రి ఒక శుభవార్త వినిపించారు. దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్ రాయితీ పొందుతున్న వారు పీఎన్జీ కనెక్షన్కు మారినా.. వారి రాయితీ సొమ్ముకు ఎటువంటి ఢోకా ఉండదని స్పష్టం చేశారు. వారు పైప్డ్ గ్యాస్ వాడుకున్నప్పటికీ, వారికి రావాల్సిన రాయితీ సొమ్మును యథావిధిగా వారి వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నిర్ణయం వల్ల పేద కుటుంబాలపై అదనపు భారం పడకుండా ఆధునిక ఇంధన వనరులు అందుబాటులోకి వస్తాయి.
శ్రీకాకుళం – కాకినాడ నేచురల్ గ్యాస్ పైప్ లైన్ పనుల్లో జరుగుతున్న జాప్యంపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని అనుమతులు మరియు నిర్ణయాలు రావాల్సి ఉందని అధికారులు వివరించడంతో.. చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నుంచే కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీకి ఫోన్ చేశారు. టెండర్ల ప్రక్రియ ఇప్పటికే పూర్తయినందున, మిగిలిన పనులను వెంటనే పూర్తి చేసేలా చొరవ తీసుకోవాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి, త్వరలోనే సమీక్ష నిర్వహించి పనులను వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో గ్యాస్ గ్రిడ్ ఏర్పాటు దిశగా అడుగులు వేయాలని సీఎం అధికారులకు సూచించారు.
Read Also: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. రూ. 39,436 కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్