CM Chandrababu: శ్రీవారి వైకుంఠ దర్శనం టోకెన్ల తొక్కిసలాట ఘటన కొత్త మలుపు తిరుగుతుందా? ఈ ఘటన వెనుక ఇద్దరు అత్యుత్సాహం చూపించారా? ఒకరు డీఎస్పీ అయితే మరొకరు అంబులెన్స్ డ్రైవర్లా? దీని వెనుక ఏమైనా రాజకీయ కుట్ర ఉందా? ఇవే ప్రశ్నలు చాలామందిని భక్తులను వెంటాడుతున్నాయి.
శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల విషయంలో వారం నుంచి భక్తులను అలర్ట్ చేసింది టీటీడీ. నేరుగా ఛైర్మన్ బీఆర్ నాయుడు రంగంలోకి దిగి టికెట్లు జారీ చేసే కేంద్రాలను పరిశీలించారు. ఎప్పటికప్పుడు సిబ్బందిని అప్రమత్తం చేశారు. అయినా కొందరు అత్యుత్సాహం వల్ల తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు మృతి చెందారు. 29 మందికి వరకు భక్తులు గాయపడినట్టు తెలుస్తోంది.
ఈ ఘటన విషయం తెలియగానే సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. తొక్కిసలాట వెనుక వెంటనే రిపోర్టు కావాలని అధికారులను ఆదేశించారు. ఘటనపై నివేదిక సీఎం చంద్రబాబుకు అందినట్టు అంతర్గత సమాచారం. ఓ డీఎస్పీ చేసిన అత్యుత్సాహం కారణంగా ఇదంతా జరిగినట్టు తేలింది.
బైరాగి పట్టెడ పద్మావతి పార్క్లో జరిగిన తొక్కిసలాట ఘటనపై నివేదిక సీఎం చంద్రబాబు అందించినట్లు తెలుస్తోంది. ఓ డీఎస్పీ చేసినా అత్యుత్సాహం వల్ల దర్శనం టికెట్లు కోసం గేటు వద్దకు భక్తులు ఒక్కసారిగా దూసుకొచ్చినట్టు తెలుస్తోంది. భక్తులు ఒక్కసారిగా ముందుకు రావడంతో తొక్కిసలాట జరిగినట్టు నివేదికలో పేర్కొన్నారు.
ALSO READ: చెడు జరుగుతుందని ముందే గ్రహించా.. అధికారులదే తప్పిదం.. టీటీడీ చైర్మన్
తిరుపతిలోని బైరాగి పట్టెడ పద్మావతి పార్క్లో తొక్కిసలాట ఘటన జరిగింది. ఘటన జరిగిన తర్వాత సరైనా రీతిలో డిఎస్పీ స్పందించలేదని తేలింది. సకాలంలో అదనపు సిబ్బందితో ఎస్పీ సుబ్బారాయుడు సహా ఇతర పోలీసు సిబ్బంది చేరుకుని కిందపడి పోయిన భక్తులను బయటకు తీసుకుని వచ్చి సీపీఆర్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. లేకుంటే మృతుల సంఖ్య మరింతగా పెరిగి ఉండేదని అంటున్నారు ప్రత్యక్ష సాక్షులు.
ఇది ఒకవైపు మాత్రమే.. రెండోవైపు వస్తే.. అంబులెన్స్ వాహనాన్ని టికెట్ల కౌంటర్ బయట పార్క్ చేసి వెళ్ళిపోయారు డ్రైవర్లు. ఘటన జరిగి దాదాపు 20 నిమిషాల వరకు వారు అందుబాటులో లేరు. ఇటు డీఎస్పీ, అటు అంబులెన్స్ డ్రైవర్ల నిర్లక్ష్యంగా మృతుల సంఖ్య పెరిగిందని పేర్కొంది. డిఎస్పీ వ్యవహార శైలిపై ఎస్పీ సుబ్బారాయుడు, కలెక్టర్కు ఫిర్యాదు చేశారు సిబ్బంది, భక్తులు.
ప్రస్తుతానికి ప్రాథమిక రిపోర్టును అధికారులు అందజేశారు. పూర్తి డీటేల్స్ త్వరలో ఇవ్వనున్నారు. ఇందులో రాజకీయ కోణం ఏమైనా ఉందా అనేదానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. గురువారం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఘటన జరిగిన ప్రాంతాన్ని సందర్శించనున్నారు.
2022లో టోకెన్ల వ్యవస్థను తీసుకొచ్చింది అప్పటి సర్కార్. పది రోజులు వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు జారీ చేసే వ్యవస్థను ఏర్పాటు చేసింది. గడిచిన రెండేళ్ల నుంచి ఇదే విధంగా తొక్కిసలాట జరిగిందనే టాక్ అక్కడ బలంగా వినిపిస్తోంది.
ఈ ఘటనను తనకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడింది వైసీపీ. వెంకన్న దర్శనానికి టోకెన్ల కోసం పోటెత్తిన భక్త జనానికి భద్రత కోసం ఇటు ప్రభుత్వ, అటు టీటీడీ ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని తెలిపింది. ఆ నిర్లక్ష్యం కారణంగా ఆరుగురు మృతి చెందారని తెలిపింది.