Vijayawada: ఆంధ్రప్రదేశ్ కేవలం టెక్నాలజీకి మాత్రమే కాదు ఆధ్యాత్మిక కేంద్రానికి హబ్గా మారబోతోందన్నారు సీఎం చంద్రబాబు. రోజు అరగంటపాటు యోగా చేయాలన్నారు. ప్రతీరోజూ మెడిటేషన్, ప్రాణామాయం చేయాలన్నారు. అలా చేస్తే ఆసుపత్రికి వెళ్లే అవసరం లేకుండా హాయిగా జీవించవచ్చని తెలిపారు.
టెక్నాలజీకే కాదు.. ఆధ్యాత్మిక కేంద్రంగా ఏపీ
ఆదివారం విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. యోగా గురు బాబా రాందేవ్తో కలిసి వేంకటేశ్వర సుప్రభాతం, గోవింద నామస్మరణతో ముఖ్యమంత్రి యోగా సాధన చేశారు. అనంతరం యోగా దినోత్సవాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.
యోగా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. సంక్లిష్టమైన యోగాసనాలను సునాయాసంగా చేశారు ముఖ్యమంత్రి. రాందేవ్ బాబాతో కలిసి దాదాపు 45 నిమిషాలపాటు యోగాసనాలు వేశారు. తాను మూడు దశాబ్దాలుగా యోగా సాధన చేస్తున్నారని వివరించారు సీఎం చంద్రబాబు.
యోగా గురు బాబా రాందేవ్తో సీఎం చంద్రబాబు యోగాసనాలు
అనేక ఒత్తిళ్లు ఉంటాయని, వాటిని యోగాతోనే అధిగమిస్తున్నారని చెప్పుకొచ్చారు. సాంకేతికతతోపాటు యోగా ఆధ్యాత్మిక సాధన చేయాలన్నారు. యోగాలో రాందేవ్ బాబా దేశానికే కాదు, ప్రపంచానికి ఆయన మార్గ దర్శకుడిగా వర్ణించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను కొనియాడారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి యోగాను చేరవేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే ప్రధాన లక్ష్యమన్నారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామ-వార్డు సచివాలయాల పరిధిలో యోగా మందిరాలను నిర్మిస్తామన్నారు. యోగా కార్యక్రమాల పర్యవేక్షణకు జిల్లా, మండల స్థాయిల్లో ప్రత్యేక అధికారులను నియమించనున్నట్లు వెల్లడించారు. యోగాంధ్ర పేరుతో ప్రత్యేక పోర్టల్ను అందుబాటులోకి తీసుకువస్తామని వివరించారు.
ALSO READ: పవన్కు హోంశాఖ ఛాన్స్.. వైసీపీ రౌడీ మూకకు వార్నింగ్, డోర్ డెలివరీ మాటేంటి?
యోగా పద్ధతులను రూపొందించేందుకు నిపుణులతో కూడిన ఓ బృందాన్ని ఏర్పాటు చేస్తామని మనసులోని మాట బయటపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా 190 దేశాల్లో యోగాకు గుర్తింపు తీసుకొచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ విశ్వగురువుగా ఎదుగుతోందని, యోగాను సామాన్య ప్రజలకు చేరువ చేయడంలో రామ్దేవ్ బాబా కృషి అమోఘమన్నారు. అనంతరం ముక్త భారత ప్రచార యాత్ర వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు కేంద్రమంత్రులు, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.