CM Jagan Filed Nomination(Andhra pradesh election news): ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. పులివెందుల రిటర్నింగ్ అధికారికి జగన్ నామినేషన్ పత్రాలను అందజేశారు. నామినేషన్ అఫిడవిట్ లో జగన్ ఆస్తుల వివరాలను వెల్లడించారు. జగన్ చరాస్తులు రూ.483 కోట్లు ఉండగా స్థిరాస్తులు రూ.35 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. వైఎస్ భారతి చరాస్తులు రూ.113 కోట్లు, స్థిరాస్తులు రూ.31 కోట్లు ఉన్నట్లు తెలిపారు.
ఉదయం గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో పయనమై కడప ఎయిర్ పోర్టుకు చేరుకుని, అక్కడి నుంచి హెలికాప్టర్ లో పులివెందుల వెళ్లారు. సీఎస్ఐ గ్రౌండ్ లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. అనంతరం భారీ ర్యాలీతో నామినేషన్ దాఖలుకు చేసేందుకు వెళ్లారు. ర్యాలీలో జై జగన్ నినాదాలతో పులివెందుల వీధులు దద్దరిల్లాయి. నామినేషన్ వేసిన అనంతరం భాకరాపురంలోని ఇంటికి వెళ్లి..రెస్ట్ తీసుకుంటారు. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో హెలికాప్టర్ ద్వారా కడపకు చేరుకుని అక్కడి నుంచి గన్నవరంకు వెళ్లి.. అక్కడి నుంచి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
మరోవైపు వివేకా హత్యకేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరికి భద్రత పెంచారు. గురువారం జై భారత్ పార్టీ నుంచి నామినేషన్ వేయనున్న దస్తగిరికి పోలీస్ శాఖ భద్రత పెంచింది. ఇప్పటి వరకూ 3+3, 4+4 గా ఉన్న భద్రతను రెండ్రోజులు 10+10గా పెంచింది. వైసీపీ నేతలు తన నామినేషన్ ను అడ్డుకోవాలని కుట్రలు చేస్తున్నారని, జగన్ నామినేషన్ సమయంలోనే తానూ నామినేషన్ వేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు.
ఏపీలో నామినేషన్ల స్వీకరణకు నేటితో గడువు ముగియనుంది. రేపటి నుంచి నామినేషన్ల పరిశీలన జరగుతుంది. గురువారం భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. 203 మంది ఎంపీ అభ్యర్థులు 236 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. 1123 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు 1344 సెట్ల నామినేషన్లు వేశారు.