
Jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్ బుధవారం అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. తొలుత నార్పల ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలకు చేరుకుంటారు. ఆ తర్వాత నార్పల క్రాస్ రోడ్డు వద్ద నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ వేదికపై నుంచే జగనన్న వసతి దీవెన లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తారు.
రాష్ట్రవ్యాప్తంగా 9,55,662 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.912.71 కోట్ల నగదును సీఎం జగన్ జమ చేస్తారు. ఈ మొత్తంతో కలిపి ఇప్పటి వరకు 25,17,245 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.4,275.76 కోట్లు జమ చేసినట్లు అవుతుంది.
వసతి దీవెన పథకం కింద ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థుల భోజన, వసతి ఖర్చుల కోసం ఏటా రెండు విడతల్లో ప్రభుత్వం ఆర్ధికసాయం అందిస్తోంది. మెడిసిన్, ఇంజినీరింగ్, డిగ్రీ లాంటి ఉన్నత విద్యాకోర్సులు అభ్యసించే విద్యార్థులకు రూ.20 వేల చొప్పున అందిస్తోంది. పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు చొప్పున ఆర్థికసాయం చేస్తోంది.