URSA Clusters : ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఏపీ పాలిటిక్స్ను షేక్ చేస్తోంది. కేశినేని బ్రదర్స్ను రోడ్డు మీదకు లాగింది. విశాఖలో AI డేటా సెంటర్లు ఏర్పాటు చేసేందుకు ఉర్సా క్లస్టర్స్కు 60 ఎకరాల భూమిని కేటాయించింది ఏపీ ప్రభుత్వం. హైదరాబాద్లోనూ 5వేల కోట్లతో.. 100 మెగావాట్ల ఏఐ ఆధారిత డేటా సెంటర్ హబ్ ఏర్పాటు చేసేలా ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. సతీష్ అబ్బూరి, కౌశిక్ పెందుర్తిలు ఉర్సా క్లస్టర్స్లో డైరెక్టర్లుగా ఉన్నారు.
అసలు గొడవేంటంటే..
విశాఖపట్నంలోని ఐటీ పార్క్లో 3.5 ఎకరాలు.. కాపులుప్పాడలో 56.36 ఎకరాల భూమిని ఉర్సాకు కేటాయించింది ఏపీ కేబినెట్. రూ. 5,778 కోట్లు పెట్టుబడితో AI డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఇదే విషయంలో విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని ఎంటర్ అయ్యారు. ఉర్సా క్లస్టర్స్కు విశాఖలో ల్యాండ్ కేటాయింపు వెనుక తన సోదరుడు కేశినేని చిన్ని హస్తం ఉందని.. ఆయన బినామీ కంపెనీ అంటూ ఆరోపించారు. URSA క్లస్టర్లకు కేటాయించిన భూమిని రద్దు చేయాలని సీఎం చంద్రబాబుకు ట్వీట్ చేశారు. నానికి చిన్ని సైతం అదే స్థాయిలో కౌంటర్లు ఇస్తుండటంతో.. ఇద్దరి మధ్య అన్నదమ్ముల వార్ నడుస్తోంది.
నానికి చిన్ని కౌంటర్స్
నాని మతి భ్రమించి సోషల్ మీడియా రోడ్లపై తిరుగుతున్నారంటూ పరోక్షంగా ఎంపీ చిన్ని సైతం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అభివృద్ధిపై విషం చిమ్ముతున్న ఆ వ్యక్తితో జాగ్రత్తగా ఉండాలంటూ ట్వీట్ చేశారు. నాని మళ్లీ రియాక్ట్ అయ్యారు. తనను వ్యక్తిగతంగా ఎన్ని అనుకున్నా పర్వాలేదని.. కానీ ప్రభుత్వం విశాఖను అమ్మకానికి పెట్టడం సరికాదన్నారు.
వైసీపీ భయపెడుతోందా?
తప్పుడు ప్రచారాలతో పారిశ్రామిక వేత్తలను వైసీపీ నేతలు భయపెడుతున్నారని టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని ఆరోపించారు. కంపెనీలకు ప్రభుత్వం భూములు కేటాయిస్తే తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి 20 సూట్ కేస్ కంపెనీలను పెట్టారని విమర్శించారు. చేతనైతే తనను రాజకీయంగా ఎదుర్కోవాలని సవాల్ చేశారు. పెట్టుబడిదారులపై లేనిపోని అభాండాలు వేస్తే ఊరుకునేది లేని వార్నింగ్ ఇచ్చారు. ఆడుదాం ఆంధ్ర అరాచకాలన్ని త్వరలోనే బయటకు వస్తాయన్నారు చిన్ని.
క్లస్టర్ కంపెనీ రియాక్షన్
మరోవైపు.. జరుగుతున్న వివాదంపై ఉర్సా క్లస్టర్స్ సహా వ్యవస్థాపకులు సతీష్ అబ్బూరి స్పందించారు. ఏపీకి పెట్టుబడులు రాకుండా వైసీపీ కుట్రలు చేస్తోందని.. తప్పుడు ప్రచారాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరిస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు. తాను కానీ, తన భార్య కానీ 21st Century Investments and Properties Pvt. Ltd. లో ఎలాంటి పదవులు చేపట్టలేదని.. ఎటువంటి వ్యాపార కార్యకలాపాల్లోనూ పార్టిసిపేట్ చేయలేదని స్పష్టం చేశారు. 1995 నుంచి తాను యునైటెడ్ స్టేట్స్లో స్థిరపడ్డానని.. AI, Data Management లో అపారమైన అనుభవం తనకు ఉందని చెప్పారు. పదేళ్లుగా యూఎస్ మార్కెట్లో ఎంట్రప్రెన్యూర్గా వ్యాపారాలను విస్తరిస్తూ.. ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నానని సతీష్ అబ్బూరి అన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టి.. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే సదుద్దేశంతో ఉర్సా క్లస్టర్స్తో ముందుకు వస్తుంటే.. ఎన్ఆర్ఐలను అవమానించేలా, తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా వైసీపీ నేతలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. బినామీల బాగోతాలు లాంటివి తనకు తెలీదన్నారు. తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైసీపీ మాజీ ఎంపీ కేశినేని నాని తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలు ఉంటే చూపించాలని డిమాండ్ చేశారు. లేదంటే, నిరాధార ఆరోపణలను బహిరంగంగా వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలన్నారు ఉర్సా క్లస్టర్ కో ఫౌండర్ సతీష్ అబ్బూరి.