Hidma Encounter: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మడావి హిడ్మా (సంతోష్), ఆయన సతీమణి రాజే (రాజక్క)ల మృతిపై సీపీఐ (ఎంఎల్) జనశక్తి కేంద్ర కమిటీ తీవ్రంగా స్పందించింది. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ బూటకమని, వీరిని పథకం ప్రకారం పట్టుకుని అత్యంత క్రూరంగా హత్య చేశారని జనశక్తి కేంద్ర కమిటీ ప్రతినిధి చంద్ర ప్రకాష్ సోమవారం ఒక పత్రికా ప్రకటనలో ఆరోపించారు. హిడ్మాను నేటి భారత బిర్సా ముండాగా, ఆదివాసీల హక్కుల పోరాట వారసుడిగా వారు అభివర్ణించారు.
కేంద్ర ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్, బీజేపీ శక్తులు ‘ఎర్ర టెర్రరిజం’ అంతం పేరుతో గత 23 నెలలుగా దేశంలో నరమేధానికి పాల్పడుతున్నాయని లేఖలో మండిపడ్డారు. దేశంలోని అటవీ సంపదను, ఖనిజాలను, నీటి వనరులను దేశ, విదేశీ కార్పొరేట్లకు కట్టబెట్టేందుకే.. అడ్డుగా ఉన్న ఆదివాసీలను, విప్లవకారులను లక్ష్యంగా చేసుకున్నారని విమర్శించారు. అభివృద్ధి పేరుతో అడవులను ధ్వంసం చేస్తూ, ఆదివాసీలను నిర్వాసితులను చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మావోయిస్ట్ పార్టీలో కోవర్టులను తయారుచేసి, ఉద్యమాన్ని దెబ్బతీసే కుట్రలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
ఎంతోమంది అగ్రనాయకులను కోల్పోయినప్పటికీ విప్లవోద్యమం ఆగిపోదని చంద్ర ప్రకాష్ స్పష్టం చేశారు. ఆర్కే, గాజర్ల రవి, ఇప్పుడు హిడ్మా వంటి నాయకులు అమరులైనప్పటికీ, మార్క్సిజం-లెనినిజం-మావోయిజం సిద్ధాంతానికి మరణం లేదని తెలిపారు. దోపిడీ, పీడన ఉన్నంత కాలం ప్రజా పోరాటాలు ఎగిసిపడుతూనే ఉంటాయని, ఇది తాత్కాలిక ఎదురుదెబ్బ మాత్రమేనని వెల్లడించారు. ప్రజలపై యుద్ధంగా సాగుతున్న ‘ఆపరేషన్ కగార్’ను ప్రతిఘటించాలని, బూటకపు ఎన్కౌంటర్లను ఖండించాలని పిలుపునిచ్చారు.