Viveka Murder case: సీబీఐ దూకుడు పెంచింది. వైఎస్ భాస్కర్రెడ్డిని అరెస్ట్ చేసింది. ఎంపీ అవినాష్రెడ్డినీ విచారణకు పిలిచింది. ఆయన్ను కూడా అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. అదే అనుమానంతో హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు అవినాష్. ఇక, విచారణకు పిలిచినప్పుడల్లా.. హైకోర్టులో పిటిషన్ వేస్తుండటాన్ని కోర్టు దృష్టికి తెచ్చింది సీబీఐ. మరోవైపు, ఎంపీ అవినాష్రెడ్డి వివేకా హత్య కేసులో తన వాదన తాను వినిపిస్తున్నారు. సీబీఐ విచారణ జరుపుతున్నయాంగిల్కు కంప్లీట్ డిఫరెంట్ వెర్షన్ చెబుతున్నారు. వివేకా రెండో భార్య, ఆస్థి గొడవలనే ప్రముఖంగా చూపిస్తున్నారు. అటు, అప్రూవర్గా మారిన దస్తగిరిపై పదే పదే విమర్శలు చేస్తున్నారు. దస్తగిరిని సీబీఐ బెదిరించిందని.. బెయిల్ వచ్చేలా సహకరించిందని అవినాష్ ఆరోపణ.
దస్తగిరి మాత్రం తనకు ఎంపీ అవినాశ్రెడ్డి, సీఎం జగన్తో ఇప్పటికీ ప్రమాదం పొంచి ఉందని అంటున్నాడు. వివేకా కుమార్తె సునీత, సీబీఐ నుంచి తాను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని చెప్పాడు. తాను అప్రూవర్గా మారే సమయంలో అవినాష్ లాంటి వాళ్లు ఎందుకు ప్రశ్నించలేదు? మీ వరకు రానంత వరకు దస్తగిరి మంచోడు.. ఇప్పుడు చెడ్డవాడా? అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నాడు దస్తగిరి. అప్పుడు డబ్బుకు ఆశపడి ఎర్రగంగిరెడ్డి చెప్పినట్లు చేశానని.. ఇప్పుడు తనకు ఆ అవసరం లేదు కాబట్టే సీబీఐకి నిజం చెప్పేశానని ప్రెస్మీట్ పెట్టి మరీ వివరణ ఇచ్చాడు.
పలుకుబడి ఉపయోగించి సీబీఐ ఎస్పీ రామ్సింగ్ను కూడా మార్చేశారని దస్తగిరి ఆరోపించాడు. ఆయన్ను మార్చితే కొత్త బృందం కొత్తకోణంలో విచారిస్తుందా? అని నిలదీశాడు. కేసులో వారి పాత్ర ఉండి కాబట్టే.. సీబీఐ వారిని విచారిస్తోందని అన్నాడు. తాను పులివెందులలోనే ఉంటున్నానని.. ఎక్కడికీ పారిపోనని.. దేనికైనా సిద్ధమేనని.. సవాల్ విసురుతున్నాడు దస్తగిరి. తాను తప్పు చేస్తే జైలుకెళతానని.. మీరు తప్పు చేస్తే మీరు జైలుకు వెళ్తారంటూ.. నేరం రుజువైతే రాజీనామా చేస్తారా? అంటూ ఎంపీ అవినాష్రెడ్డి, సీఎం జగన్లను ఉద్దేశించి దస్తగిరి సంచలన వ్యాఖ్యలు చేశారు.