DCM Pawan Kalyan: తన శాఖలో ఉన్న అవినీతి అధికారుల భరతం పట్టేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. తాను అవినీతిని సహించే ప్రసక్తే లేదని, ఇన్ని రోజులుగా పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల భరతం పట్టేందుకు పవన్ పచ్చజెండా ఊపారు. దీనితో పంచాయతీ రాజ్ శాఖ అధికారుల్లో కాస్త తీవ్ర చర్చ సాగుతోంది. ఒక్కసారిగా పవన్, అవినీతి అధికారులపై నమోదైన కేసుల గురించి సమీక్షించడం ఇప్పుడు చర్చకు దారితీసింది.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుక్రవారం తన శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో క్రమశిక్షణ చర్యలు, శాఖపరమైన విచారణలకు సంబంధించినవి ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న అంశంపై పవన్ కళ్యాణ్ దృష్టి సారించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృధ్ది, ఆర్.డబ్ల్యూ.ఎస్., అటవీ, పర్యావరణ శాఖల్లో ఉన్న విజిలెన్స్, ఏసీబీ, శాఖాపరమైన కేసుల వివరాలు, అవి ఎంత కాలంగా పెండింగ్ లో ఉన్నాయి, అందుకుగల కారణాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని సంబందిత శాఖల ముఖ్య కార్యదర్శులను పవన్ ఆదేశించారు.
కొన్ని కేసులు 20 ఏళ్ల నుంచి పెండింగ్ లో ఉన్న విషయం పవన్ కళ్యాణ్ గుర్తించారు. ఈ విధంగా కేసులు అపరిష్కృతంగా ఉండటం మూలంగా అధికారులు, సిబ్బంది, ఉద్యోగ విరమణ తర్వాత కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందలేదు. సిబ్బంది తమ ఉద్యోగ కాల పరిమితిలో పదోన్నతుల్లోనూ వెనుకబడిన వారున్నారని డిప్యూటీ సీఎం గ్రహించారు.
అనంతరం పవన్ మాట్లాడుతూ.. విజిలెన్స్, ఏసీబీ, శాఖాపరమైన విచారణలు వేగవంతం చేయాలన్నారు. ఏళ్ల తరబడి కేసులు పెండింగ్ లో ఉంచడానికి కారణాలు, ఎన్ని కేసులు పెండింగ్ లో ఉన్నాయో వాటి వివరాలపై నివేదిక సిద్ధం చేయాలని, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖ ముఖ్య కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగుల పనితీరు మీద సున్నితమైన విజిలెన్స్ ఉండాలని, వారు అప్రమత్తంగా, అత్యుత్తమంగా పని చేయడానికి ఇది ఉపయోగపడుతుందన్నారు.
ఉద్యోగుల నిజాయతీ, పనితీరు, నిబద్ధతకు అది ఓ సూక్ష్మదర్శనిలా పని చేస్తుందని, అయితే ఉద్యోగులపై నమోదవుతున్న విజిలెన్స్ కేసులు, శాఖాపరమైన విచారణలు, దర్యాప్తులు, చర్యలు ఏళ్ల పాటు పెండింగ్ లో ఉండిపోవడం ఉద్యోగుల పని తీరుపై ప్రభావం చూపిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
ఈ క్రమంలో విజిలెన్స్ పెండింగ్ కేసులపై నివేదికను మూడు వారాల్లో ఇవ్వాలని ఆదేశించారు. అభియోగాలు వచ్చిన వారిపై విచారణ ప్రారంభించినపుడు దానికి తగిన పత్రాలు అందుబాటులో ఉండటం లేదని, ఇది విచారణ జాప్యానికి కారణం అవుతోందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి స్పందిస్తూ తన శాఖల పరిధిలో విజిలెన్స్ రిపోర్టుల ఆధారంగా తీసుకునే చర్యల్లో వేగం పెంచేందుకు ప్రత్యేక మార్గదర్శకాలను సూచించారు.
Also Read: AP Govt: ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్కు షాక్.. విచారణకు ఆదేశించిన ప్రభుత్వం
ఏదైనా విషయంలో అధికారులు, సిబ్బందిపై ఆరోపణలు వస్తే ప్రాథమిక విచారణ పకడ్భందీగా జరపాలన్నారు. ప్రాథమిక విచారణలోనూ బలమైన సాక్ష్యాలు సేకరించాలని, విచారణాధికారికి, ఆరోపణలు వచ్చిన ఉద్యోగికి మధ్య సన్నిహిత సంబంధాలు లేకుండా తొలి దశలోనే నిరోధించాలని స్పష్టం చేశారు. శాఖల్లోని అన్ని విజిలెన్స్, నాన్ విజిలెన్స్ కేసులను సరైన, సక్రమమైన రీతిలో తిరిగి విచారించి వేగంగా వాటిని పరిష్కరించేందుకు శాఖాధిపతులు దృష్టి సారించాలన్నారు.