ఏపీ రాజకీయాలు మునుపెన్నడూ లేని విధంగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉన్నాయి. ప్రతిపక్ష వైసీపీ నేతల ఆరోపణలు, విమర్శలు, అసభ్యకర మాటలు, కుట్రలుకుతంత్రాలకు అధికార పార్టీ నేతలు సహనం కోల్పోతున్నట్టు తెలుస్తున్నది. ప్రతిపక్షంలో ఉన్నంతకాలం శాంతంగా ఉన్నామని, ఇప్పుడు కూడా అలాగే ఉంటే వైసీపీ నేతల ఆగడాలు పేట్రేగిపోతాయని తెలుగు తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. ప్రతిసారి చేతులు కట్టుకుని కూర్చోవడం వలన వైసీపీ గూండాల చేష్టలు మితిమీరుతున్నాయని.. ఈసారి ఎలాగైనా వారికి బుద్ది చెప్పాల్సిందేనని రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతున్నట్టు సమాచారం. రెండ్రోజుల కిందట జరిగింది కేవలం ట్రైలర్ మాత్రమేనని,సినిమా ఇంకా ముందున్నదని ప్రచారం జరుగుతోంది.
ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రస్తుతం అధికారంలో ఉన్నది. వైసీపీ నేతలు ప్రతిపక్షంలో ఉన్నారు. కానీ, ఈ విషయం మరిచి వైసీపీ నేతలు ప్రవర్తిస్తున్నట్టు తెలుస్తున్నది. తామే నేటికి అధికారంలో ఉన్నాం అనేలా వారి ప్రవర్తన ఉందని, తమ ఓపికను వారు పరిక్షిస్తున్నారని తెలుగు తమ్ముళ్లు పార్టీ పెద్దల వద్ద తమ ఆవేదనను వెల్లగక్కినట్టు సమాచారం. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అశాంతిని రగిలించి కుల, మతాల మధ్య చిచ్చు రేపి ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని వారు చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలు ఆ కోవలోకి వస్తాయని గుర్తుచేస్తున్నారు.ఏదేమైనా ఈసారి అధిష్టానం తమను కంట్రోల్ చేసినా తగ్గేదేలే అని పార్టీ నేతలు చెబుతున్నట్టు తెలుస్తున్నది.
సీఎం చంద్రబాబు మీద అంబటి రాంబాబు వ్యాఖ్యలతో తెలుగు తమ్ముళ్లు సిగమూగారు.ఆయన ఇంటి మీద, ఆఫీసు మీద దాడులకు పాల్పడ్డారు. ఆ తర్వాత అదే సీన్ మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటి మీద జరిగింది. ఆయన ఇంటికి పలువురు నిప్పు పెట్టారు. మొదటి కేసులో రాష్ట్రంలో అశాంతికి కుట్ర లేపారని అంబటి రాంబాబు మీద రెండు కేసులు పెట్టి పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. ఇక జోగిరమేశ్ ఇటీవల జైలు నుంచి బయటకు రాగా.. రాష్ట్రంలో అలజడులు సృష్టిస్తున్న కారణంగా ఆయన్ను మరోసారి అరెస్టు చేస్తారని ప్రచారం జరుగుతోంది.
అయితే, పై రెండు ఘటనలతో వైసీపీ నేతలకు భయం పట్టుకున్నదని టాక్ వినిపిస్తోంది.. ఏకంగా మాజీమంత్రులకే అటువంటి ట్రీట్మెంట్ ఉంటే తమ పరిస్థితి ఏంటని జిల్లా, మండల స్థాయి నేతలు భయంతో వణుకుతున్నట్టు తెలుస్తున్నది.తమ అధినేత మీదే అసభ్య పదజాలం వాడతారా? అని తెలుగు తమ్ముళ్లు కోపంతో ఊగిపోతున్నారు. ఇంతకాలం ఓపికతో ఉన్నామని, ఇక మీదట తమ చేతల్లో చూపిస్తామని ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికైనా రాష్ట్ర అభివృద్ధిలో ప్రభుత్వంతో కలిసి నడవాలని, ఇష్టం లేకపోతే మౌనంగా ఉండాలి తప్పా అలజడులు సృష్టిస్తాం.. ఇలాగే ఇష్టానుసారంగా మాట్లాడుతాం అంటే చూస్తూ ఊరుకునేది లేదని తెలుగు తమ్ముళ్లు బహిరంగంగా వార్నింగ్ ఇస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.